ధరలు తగ్గించం కానీ: జీఎస్టీ తగ్గింపుపై వ్యాపార సంస్థల కొత్త మెలిక
హైదరాబాద్/న్యూఢిల్లీ: వినియోగదారులకు ఊరట కలిగించేలా వస్తు సేవల పన్ను (జిఎస్టీ) కింద నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారు. ధరలు తగ్గించే విషయంలో వ్యాపార సంస్థలు మాత్రం ఓ మెలిక పెడుతున్నాయి.
28 శాతం శ్లాబులో ఉన్న 178 నిత్యావసర వస్తువులను అంతకు తక్కువ శ్లాబులకు మార్చారు. ఈ మేరకు జీఎస్టీ మండలి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని ఆయా కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.
ధరలు తగ్గించం కానీ పరిమాణం పెంచుతాం
అందుకు అనుగుణంగానే కొన్ని కంపెనీలు తమ వస్తువులపై ధరలను తగ్గించనున్నట్లు చెప్పాయి. కొన్ని కంపెనీలు మాత్రం ధరలను తగ్గించబోమని చెబుతున్నాయి. ధరలు తగ్గించే బదులు అందుకు మరో మార్గం సూచిస్తున్నాయి. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు చేర్చేందుకు అదే ధరలకు ఎక్కువ వస్తువులు ఇస్తామని చెబుతున్నాయి.
ధరలు మార్పు చేయకుండా ఈ కంపెనీలు
ఆయా వస్తువుల ధరలలో ఎలాంటి మార్పులు చేయకుండా వస్తువుల పరిమాణం పెంచేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమని చెప్పాయి. బోర్నవిటా, క్యాడ్బరీ, ఓరియో, హిందుస్థాన్ యునిలివర్ లాంటి సంస్థలు ఈ ఫార్ములాను పాటిస్తున్నట్లు చెప్పాయి.
ఇలా పెంచుతాం
తమ వస్తువుల ధరలలో ఎలాంటి మార్పులు చేయకుండా వాటి పరిమాణాన్ని పెంచుతామని అవి తెలిపాయి. 125 గ్రాముల రిన్ సబ్బు ధర రూ. 10గా ఉంది. జీఎస్టీ తగ్గించిన తర్వాత అదే రూ. 10కి 140 గ్రాముల సబ్బును విక్రయిస్తామని హిందుస్థాన్ యూనిలివర్ చెబుతోంది.
ఇలా ధరలు
దీని వల్ల కస్టమర్లు మార్పును సులభంగా గుర్తించే అవకాశముంటుందని అంటున్నారు. తమ ఉత్పత్తుల ధరలు రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.15.. ఇలా వినియోగదారులకు అనుకూలంగా ఉన్నాయని, కాబట్టి పరిమాణం పెంచుతామని చెబుతున్నారు.