ఒకే గ్రామంలో ఒకేరోజు వంద మందికి కరోనా... ముగ్గురు మృతి... భయాందోళనలో ఆ గ్రామస్తులు
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం వరకు 500 మార్క్కి కాస్త అటు ఇటుగా నమోదైన కేసులు ఇప్పుడు ఏకంగా 5వేల మార్క్ని దాటేశాయి. హైదరాబాద్ సహా దాదాపుగా అన్ని జిల్లాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఒకేరోజు 100 మంది కరోనా బారినపడటం గమనార్హం.
ఇదే గ్రామంలో గడిచిన 24గంటల్లో మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి స్వచ్చంద లాక్డౌన్ విధిస్తున్నట్లు కౌన్సిలర్ చెన్నం అశోక్ వెల్లడించారు. కేవలం నిత్యావసర సరుకుల కోసం ఉదయం రెండు గంటలు,సాయంత్రం 2గంటలు షాపులు తెరుస్తారని చెప్పారు.
నిబంధనలు అతిక్రమించి బయట తిరిగేవారికి రూ.1వెయ్యి జరిమానా తప్పదని హెచ్చరించారు. నిత్యావసర సరుకుల కోసం బయటకొచ్చేవారు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలని,భౌతిక దూరం పాటించాలని సూచించారు.
కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, బార్లు,రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని జీవోలో పేర్కొంది.ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
కాగా,ఆదివారం(ఏప్రిల్ 18) రాత్రి 8గం. నుంచి సోమవారం రాత్రి 8గం. వరకు తెలంగాణలో 5926 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1856కి చేరింది. ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,16,650కి చేరింది.ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.51శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 85.6 శాతం ఉండగా తెలంగాణలో 87.62 శాతం ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,19,42,985కరోనా టెస్టులు నిర్వహించారు.