బేగంపేట మానవబాంబు పేలుడు కేసు: ఆధారాల్లేవని కొట్టివేత, అసలు ఏం జరిగింది?
2005లో హైదరాబాదులోని బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద మానవ బాంబు పేలుడు కేసులో నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పు చెప్పింది. 12 ఏళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
హైదరాబాద్: 2005లో హైదరాబాదులోని బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద మానవ బాంబు పేలుడు కేసులో నాంపల్లి కోర్టు గురువారం తుది తీర్పు చెప్పింది. 12 ఏళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
టాస్క్ ఫోర్స్ ఆఫీస్పై దాడి కేసును న్యాయస్థానం కొట్టి వేసింది. ఆధారాలు, సాక్ష్యాధారాలు లేని కారణంగా పది మంది నిందితులపై కేసును కొట్టి వేసింది. వారిని నిర్దోషులుగా తేల్చింది.
ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు ఉండగా, ముగ్గురు ఇప్పటికే మృతి చెందారు. ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఏం జరిగిందంటే..
12 అక్టోబర్ 2005లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాది బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద మానవ బాంబుగా దాడి చేశాడు. ఈ దాడిలో అక్కడే ఉన్న హోంగార్డు సత్యనారాయణ మృతి చెందారు.
మానవబాంబుగా వచ్చిన యువకుడు టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద సెంట్రీగా ఉన్న వెంకట్రావుతో.. తాను అడిషనల్ డిసిపి వెంకట్ రెడ్డిని కలిసేందుకు వచ్చానని చెప్పాడు. సెంట్రీ సరే వెళ్లమని చెప్పగా.. అతడు డిసిపి రూం వైపు వెళ్లసాగాడు.
అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సత్యనారాయణ ఆ యువకుడిని అడ్డుకున్నాడు. సార్ను కలిసేందుకు వచ్చానని చెప్పాడు. ఇవాళ సెలవు.. అందరూ బందోబస్తులో ఉంటారని, నీ బ్యాగులో ఏముందని హోంగార్డు నిలదీశాడు.
దీంతో కంగారుపడిన యువకుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత విస్ఫోటనం జరిగింది. టాస్క్ ఫోర్స్ కార్యాలయం సగం దగ్ధమైంది. బ్యాగుతో వచ్చిన యువకుడి శరీర భాగాలు చెల్లాచెదురు అయ్యాయి. హోంగార్డు సత్యనారాయణ మృతి చెందారు. సెంట్రీ డ్యూటీలో ఉన్న వెంకట్రావు అపస్మారక స్థితిలోకి వెళ్లారు.