కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు, జగిత్యాల కూడా: రైతుల పోరాట ఫలితం
కామారెడ్డి: గత కొద్ది రోజులుగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించింది. కామారెడ్డి పట్టణ బృహత్ ప్రణాళిక(మాస్టర్ ప్లాన్) ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ను నిలిపివేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
ఈ విషయమై కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, కమిషనర్తో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. ప్రస్తుతానికి మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిపివేసినట్లు తెలిపారు.
కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని, ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అధికారులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని సుమారు నెలన్నర రోజులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రక్రియ నిలిపివేశారు.
జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ రెండు చోట్లా తీర్మానాలు ప్రవేశపెట్టారు. రైతుల ఆందోళనలతో అత్యవసరంగా సమావేశమైన మున్సిపల్ కౌన్సిల్స్..మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని ఆమోదించాయి. వాటిని ప్రభుత్వానికి పంపించామని..రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి. కాగా, జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే సంజయ్కుమార్. రైతులకు చెందిన ఇంచ్ భూమిని కూడా తీసుకోబోమన్నారు.