అందుకే ఆంధ్రావాళ్లు మనకు షాకిచ్చారు: కెసిఆర్, హెచ్చరిక
హైదరాబాద్: 2014 ఎన్నికల్లో హైదరాబాదులో, తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రాంతం ప్రజలు భయపడ్డారని, పైగా కొందరు దుష్ప్రచారం చేశారని, అందుకే అప్పుడు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిస్తే మనకు ఏదైనా జరుగుతుందని అపోహపడి టిఆర్ఎస్కు ఓటేయలేదని సీఎం కెసిఆర్ అన్నారు.
జీహెచ్ఎంసీకి ఇటీవల ఎన్నికైన టిఆర్ఎశ్ కార్పొరేటర్లకు సోమవారం ప్రగతి రిసార్ట్స్లో ప్రారంభమైన శిక్షణ శిబిరంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆస్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కొత్తగా ఎన్నికైన వారికి పాలనాపరమైన అంశాల్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన ఆంధ్రా ప్రజల ఓట్లపై మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు భయపడ్డారని, అందుకే మనకు ఓటేయలేదని, ఇరవై నెలల పాలన చూశాక, మన పాలన నచ్చి వారు తెరాసకు ఓటేశారని, వారు ఓటు వేయకుంటే మనం 99 కార్పోరేటర్లను ఎలా గెలుచుకునే వాళ్లమని ప్రశ్నించారు.
రాష్ట్రం వచ్చే వరకు అనేక పోరాటాలు చేశామని, ఇప్పుడు ఆంధ్రా లేదు తెలంగాణ లేదన్నారు. అంతా ఒక్కటేనని, ఇక్కడున్న వారంతా హైదరాబాదులే అన్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి ఎమ్మెల్యేలు 14 మంది గెలవకా, తెరాస ఒకటి మాత్రమే గెలిచింది. కానీ ఇరవై నెలల్లో అంతా రివర్స్ అయింది.
కెసిఆర్
నగరాన్ని లివబుల్, లవబుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. నగరంలోని సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రభుత్వం చేస్తున్న కృషి తదితర అంశాలను వివరించారు.
కెసిఆర్
ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని టీఆర్ఎస్ను కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చి గెలిపించారని, ఈ దిశగా నగరాన్ని సుందరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కార్పొరేటర్ల మీద ఉన్నదని ఆయన అన్నారు.
కెసిఆర్
కారణాలేమైనా కార్పొరేటర్ల మీద ప్రజల్లో సదభిప్రాయం లేదని, అంకితభావంతో పని చేసి వారి ఆదరణను చూరగొనాలని సీఎం కెసిఆర్ సూచించారు. హైదరాబాద్ గతం ఏమిటి? వర్తమానం ఏమిటి? భవిష్యత్తు ఎలా ఉండాలి? ఎలా తీర్చిదిద్దాలి అనే విషయంలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
కెసిఆర్
వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో నే ప్రారంభమవుతుందని, ఆ దిశగా సంకల్పసిద్ధితో ముందడుగు వేయాలని అన్నారు. నిరంతర విద్యుత్, 24 గంటల నీరు, గుంతలు లేని రోడ్లు, చెత్తకుప్పలు లేని వీధులు, పచ్చని చెట్లతో కూడిన హైదరాబాద్ను తయారు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతారన్నారు.
కెసిఆర్
వారికి కర్తవ్యం నిర్దేశిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మురికివాడల ప్రజలను ఒప్పించి అక్కడే కాలనీలు నిర్మించేందుకు కృషి జరపాలని, మిషన్ భగీరథ కింద ప్రతి పేదవారి ఇంట్లో నల్లా కనెక్షన్ ఇప్పించాలని, బస్తీ కమిటీలు వేసి వారికి బాధ్యతలు అప్పగించాలని, కార్పొరేటర్లు తమ డివిజన్లకే పరిమితం కాకుండా మూడు నాలుగు రోజులపాటు నగరం మొత్తం పర్యటించి పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.
కెసిఆర్
ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో అధికారులు నిర్వహించే సమీక్షా సమావేశాలకు వెళితే విషయం అర్థంకాక తాను కూడా తీవ్ర ఇబ్బంది పడేవాడినని సీఎం కెసిఆర్ చెప్పారు. ఆ పరిస్థితిని అధిగమించేందుకు వారంపాటు ఎన్ఐఆర్డీలో పంచాయతీరాజ్ వ్యవస్థపై శిక్షణ పొందానని తెలిపారు.
కెసిఆర్
తర్వాత వివిధ విభాగాల అధికారులకు లేఖలు రాసి అన్ని అంశాలపైనా పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని అధ్యయనం చేసి పట్టు సాధించానన్నారు. అధికారులు సైతం తన ఉత్సాహం చూసి ఏదైనా పని చెప్తే వెంటనే చేసేవారని, దానివల్ల పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అక్కడి ప్రజలతో తిట్లు పడేవన్నారు. ప్రజలు ఆగ్రహిస్తే వారి తీర్పు కఠినంగా ఉంటుందని కార్పోరేటర్లను హెచ్చరించారు.
కెసిఆర్
కాగా, భోజన విరామం తరువాత సీఎం కెసిఆర్ దాదాపు అరగంటపాటు కార్పొరేటర్ల మధ్య కూర్చొని నిర్వాహకులు చెప్పిన పలు విషయాలను ఆసక్తిగా విన్నారు. ఆస్కి ప్రొఫెసర్ చారి పట్టణాభివృద్ధి-నగరాలు, హైదరాబాద్ అనే అంశంపై మాట్లాడుతుండగా.. జోక్యం చేసుకుంటూ మిషన్ భగీరథ గురించి వివరించారు. ఈసారి వర్షాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలతోపాటు పంచాంగకర్తలు కూడా చెప్పినట్లు గుర్తు చేశారు.