మునుగోడు ఉపఎన్నికపై గురిపెట్టిన కేసీఆర్ ; 100మందితో భారీ స్కెచ్.. వ్యూహమిలా!!
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న నేపథ్యంలో, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అఖండ విజయం సాధించేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఈనెల 15వ తేదీ నుండి క్షేత్రస్థాయి కార్యాచరణ: సీఎం కెసీఆర్ దిశానిర్దేశం
మునుగోడు ఉప ఎన్నిక కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలను దీటుగా ఎదుర్కొంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి తో సహా ఇతర నేతలు నియోజకవర్గంలో ఉంటూ ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులు సంసిద్ధులను చేస్తుంటే, సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఎప్పటికప్పుడు వ్యూహాలను వారికి వివరిస్తున్నారు.
ఇక ఇటీవల నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఈనెల 15వ తేదీ నుండి క్షేత్రస్థాయి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు .
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను రంగంలోకి దించనున్న సీఎం కేసీఆర్
100 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మునుగోడు ఉప ఎన్నికల పర్యవేక్షణ ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మునుగోడు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు, నాంపల్లి, సంస్థాన్ నారాయణపురం, మర్రిగూడ, చౌటుప్పల్ మండలాలలో 159 గ్రామాలు ఉండగా, వాటిలో రెండు వేలకు పైగా జనాభా ఉన్న మేజర్ పంచాయతీలు 15 ఉన్నాయని నల్గొండ జిల్లా నాయకులు సీఎం కేసీఆర్ కు నివేదిక అందించారు.
రెండు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాలను 15 యూనిట్లు గా చేసి మొత్తం మునుగోడును 100 యూనిట్లుగా సీఎంకు వారు నివేదిక అందించారు.
10వ తేదీ లోపు 100 మంది నాయకులను ఫైనల్ చెయ్యనున్న కేసీఆర్
ఇక ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం పెద్దఎత్తున టిఆర్ఎస్ శ్రేణులను రంగంలోకి దింపనున్నారు. ఒక యూనిట్ కి ఒక్కో నాయకుడిని ఎంపిక చేసి, మొత్తం వంద మందిని ఈ నెల 10వ తేదీ లోపు ఫైనల్ చేసి వారికి బాధ్యతను అప్పగించనున్నారు. టిఆర్ఎస్ పార్టీకి 103 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎంపీల బలం ఉండటంతో, సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు వీరిని ఉపయోగించుకోనున్నారు. వీరు కాక మున్సిపల్, జెడ్పీ చైర్మన్లను కూడా రంగంలోకి దింపనున్నారు.
తెలంగాణా అసెంబ్లీ సెషన్ తర్వాత కార్యాచరణ
తెలంగాణ శాసనసభ సమావేశాల తర్వాత వారు నిర్దేశిత గ్రామాలకు వెళ్లి కార్యకర్తలను కలిసి కార్యాచరణలోకి దిగనున్నారు. ఇక పెద్దఎత్తున టిఆర్ఎస్ తన బలగాన్ని రంగంలోకి దింపి మునుగోడు నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెస్ లకు చెక్ పెట్టి మునుగోడు సీటును తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతోంది. మరి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ మునుగోడు ఉప ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? లేదా అన్నది? తెలియాల్సి ఉంది.