ఓయులో ఉద్రిక్తత, విద్యార్థి మృతి: నిరుద్యోగం కారణంగానేనా? రూ.50 లక్షలు డిమాండ్
Recommended Video
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మురళి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత ఆదివారం వర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగం కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్పారు. మురళి సోదరుడు, తల్లి ఓయుకు వచ్చారు. కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు.
ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థి మురళి మానేరు హాస్టల్లోని రూమ్నెంబరు 159లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియడంతో విద్యార్థులు, తెలంగాణ జేఏసీ నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు.
మురళి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మానేరు హాస్టల్ గదికి వెళ్లిన పోలీసులను విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది.
మురళి మృతదేహాన్ని తీసుకెళ్లకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. నిరుద్యోగం కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. అతని కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓయూలో వీసీ రామచంద్రరావును విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థి మృతి బాధాకరమని, మురళి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వీసీ తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. ఆత్మహత్యలను రాజకీయం చేయవద్దని కోరారు. మురళి సూసైడ్ నోట్ను తాను చూడలేదని చెప్పారు. ఓయులో ప్రశాంత వాతావరణం నెలకొనాలన్నారు.
ఆత్మహత్యపై హైదరాబాద్ సీపీ శ్రీనివాస రావు మాట్లాడారు. చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. క్లూస్ టీం ఓయూకు వెళ్లిందని చెప్పారు. ఓయులో పరిస్థితి అదుపులో ఉందన్నారు. కాగా, మురళిది సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామం.
ఉద్యోగం రాకపోవడం వల్లే మురళి ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నాగర్కర్నూలు ప్రజా గర్జన బహిరంగ సభలో అన్నారు. ఆయన మృతికి ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.