రోహిత్ ఆత్మహత్య: జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి చిక్కులు?
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దళిత పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో బిజెపికి చిక్కులు తెచ్చిపెడుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రోహిత్ ఆత్మహత్యపై బిజెపి నేత, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. రోహిత్ ఆత్మహత్య ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ హుటాహుటిన హెచ్సియులో కాలు పెట్టారు. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read: Stories about rohit suicide
రోహిత్ ఆత్మహత్య సంఘటనను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జిహెచ్ఎంసి ఎన్నికలకు వాడుకోవాలని చూస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. దీన్నిబట్టి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓ వర్గం బిజెపికి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తెరాస పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత రోహిత్ ఆత్మహత్యపై ఘాటుగా స్పందించడమే కాకుండా ఆమెకు చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉండిందనే విషయం అందరికీ తెలిసిందే.
నిజానికి, దత్తాత్రేయకు మంచి పేరు కూడా ఉంది. పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానించేవారున్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనతో ఆయన వ్యక్తిత్వంపై కూడా నీలినీడలు అలుముకునే పరిస్థితి వచ్చింది. ఆయన స్మృతి ఇరానీకి రాశారని చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దత్తాత్రేయను లక్ష్యంగా చేసుకునే రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఆందోళనలు సాగుతున్నాయి. దీంతో దత్తాత్రేయ జిహెచ్ఎంసి ఎన్నికల్లో అంత చురుగ్గా పాల్గొనే అవకాశం కూడా ఉండకపోవచ్చు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆయనకు నిరసనలు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ పరిణామాన్ని తెరాసతో పాటు కాంగ్రెసు కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మొత్తం మీద, జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బిజెపికి కష్టకాలం వచ్చి పడినట్లే.