పోలీస్ అయి ఉండి ఇలానా?: దొంగతో వివాహేతర సంబంధం అంటగట్టి..
ఓ ఎస్ఐ తన గురించి తప్పుగా ప్రచారం చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఖమ్మం జిల్లాకు చెందిన వివాహిత ఒకరు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
ఖమ్మం: ఓ ఎస్ఐ తన గురించి తప్పుగా ప్రచారం చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని ఖమ్మం జిల్లాకు చెందిన వివాహిత ఒకరు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దొంగతో అక్రమ సంబంధం అంటగట్టి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని వాపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన సోనీ అనే మహిళ సోమవారం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి వచ్చింది. ఒక దొంగతో తనకు వివాహేతర సంబంధం ఉందని స్థానిక ఎస్ఐ రామ్ చరణ్ తనపై అసభ్యకర ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వేధింపులు ఎక్కువయ్యాయని తనకు న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
కాగా, ఇదే విషయమై సోనీ గతంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కూడా ఫిర్యాదు చేసినా.. పెద్దగా లాభం లేకుండా పోయింది. ఎస్ఐ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని వాపోతూ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన పోలీసులు ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.