గాడిదను దొంగిలించారంటూ : కాంగ్రెస్ నేతపై కేసు - అరెస్ట్ : రేవంత్ ఫైర్..!!
తెలంగాణ కాంగ్రెస్ నేతపై ఒక ఆసక్తి కేసు నమోదైంది. గాడిదను దొంగిలించారంటూ తెలంగాణ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నాయకుడు వెంకట్ బలమూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినం నాడు కాంగ్రెస్ పార్టీ నిరసనలకు నిర్ణయించింది. అయితే, సీఎం గౌరవాన్ని అగౌరపరిచేలా వ్యవహరించేలా బల్మూరి వెంకట్ వ్యవహరించారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నిరసనల్లో భాగంగా వెంకట్ ఆధ్వర్యంలో పలువు కాంగ్రెస్ నేతలు శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గాడిద ముందు కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. దీని పైన టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి.
గాడిదను దొంగిలించారంటూ
గాడిద ముందు కేక్ కట్ చేసి రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేశారంటూ నిరసనకు దిగారు. ఆ ఫొటోలను వెంకట్ ట్వీట్ చేసారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు వెంకట్ పైన ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో వెంకట్ నిరసన తెలిపేందుకు వినియోగించిన గాడిద తమదంటూ..తమ అనుమతి లేకుండా గాడిదను ఎత్తుకెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీని ఆధారంగా కేసు నమోదు చేన సుకున్న పోలీసులు.. హుజూరాబాద్ పట్టణంలో వెంకట్ను అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురు కాంగ్రెస్ నేతలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రేవంత్ రెడ్డి ఆగ్రహం..ట్వీట్లు
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వెంకట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఇక, వెంకట్ పైన కేసు నమోదు చేయటంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ దీని పైన స్పందించారు. "కల్వశుంఠ'' కళ్ల ముందు కనిపిస్తుండగా గాడిద దొంగతనం కేసు పెట్టడం దుర్మార్గమంటూ ట్వీట్ చేశారు. నిరుద్యోగ యువత కోసం ప్రశ్నిస్తే.. బుద్ధిలేని గాడిదకు కోపం ఎందుకని ప్రశ్నించారు. అక్రమ నిర్బంధాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బల్మూరు వెంకట్తో పాటు కార్యకర్తలపై గాడిద దొంగతనం కేసు నమోదు చేయడంపై స్పందిస్తూ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
రిమాండ్ డైరీ కాపీ సైతం..
ట్వీట్కు అనుంబంధంగా రిమాండ్ డైరీ కాపీని, గాడిద ఫొటోను పోస్ట్ చేశారు. బల్మూరు వెంకట్ను అర్థరాత్రి అరెస్టు చేయడం దుర్మార్గమని, అప్రజాస్వామికమని, విద్యార్థి నాయకుల పట్ల పోలీసుల వ్యవహారం చట్ట విరుద్ధంగా ఉందని మరో ట్వీట్ చేశారు. కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరసనలకు ఒక హద్దు ఉంటుందని గులాబీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.