చదివేది డిగ్రీ.. చేసింది దోపిడీ... ఆ యువకులు చేసిన పనికి పర్యవసానం ఇదే!!
వరంగల్ : చదువుకోవలసిన వయస్సులో జల్సాలకు అలవాటుపడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు చాలామంది యువకులు. డిగ్రీ చదువుకునే వయసులోనే, దోపిడీలకు అలవాటుపడి పోలీసులకు పట్టుబడిన యువకులు అటు కన్న తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగల్చడం తోపాటు, సమాజానికి ప్రశ్నార్థకంగా మారారు.

జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు .. అడ్డదారిలో డబ్బు కోసం
ఇక అసలు విషయానికి వస్తే హన్మకొండ ప్రాంతానికి చెందిన అట్లూరి ప్రణీత్ కుమార్ చౌదరి, జక్కన్న పోయిన నితీష్ ప్రీతమ్ , ఎండి అశ్వక్ నవీద్ ముగ్గురు వయసు 21 సంవత్సరాలు. నిందితులు అందరు డిగ్రీ చదువుతున్నారు. వీరు ముగ్గురూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వీరి మధ్య స్నేహం కుదిరింది. ముగ్గురు కలిసి జల్సాలు చేయడం మొదలుపెట్టారు. మద్యం సేవించడం వంటి దుర్వ్యసనాలకు అలవాటు పడ్డారు. అక్కడితో ఆగకుండా జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో అడ్డదారిలో అయినా సరే డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.

బొలెరో కారు యజమానిని బెదిరించి కారుతో పాటు సెల్ ఫోన్ దోపిడీ
దీనికోసం నిందితులు ముగ్గురు దోపిడీ చేసి డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగంగా నిందితులు ఈ నెల 11వ తేది ఆర్థరాత్రి సమయంలో ములుగు రోడ్డు మీదుగా వెళ్ళుతున్న బొలెరో వాహనాన్ని నిందితులు ద్విచక్ర వాహనం పై అనుసరించి ఆటోనగర్ ప్రాంతంలో రోడ్డు పై బొలెరో వాహనంను అడ్డగించి వాహన యజమానిని బెదిరించి అతి నుండి సెల్ ఫోన్ తో పాటు సదరు బొలెరో వాహనాన్ని దోపిడీ చేసి పారిపోయారు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు .. పట్టుబడిన నిందితులు
ఈ సంఘటనపై భాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మట్టెవాడ పోలీసులు లభించిన ఆధారాలతో నిందితులను గుర్తించారు. ఇక పోలీసులు వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేసారు. నిందితులు తాము దోపిడీ చేసిన కారును ఆటోనగర్ లో అమ్మి సొమ్ము చేసుకుందామని ఈరోజు ఉదయం ముగ్గురు చోరి చేసిన కారులో హనుమాన్ జంక్షన్ మార్గం నుండి ఆటోనగర్ పై వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మట్టెవాడ పోలీసులు హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.

బొలెరో వాహనం, ఒ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం .. నిందితులు జైలుకు
వీరి నుండి పోలీసులు ఒక బొలెరో కారుతో పాటు ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో వారు దొంగతనం చేసినట్టు అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని ఊచలు లెక్క పెట్టించనున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుని ముగ్గురు యువకులు జైలు పాలవడం ఆ కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగిలిస్తే, ఇలా జల్సాలకు అలవాటు పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్న యువత తీరు ప్రస్తుతం సమాజానికి పెను సవాలు విసురుతోంది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పెరిగిపోవడం పెడదారి పడుతున్న యువత తీరుకు అద్దం పడుతుంది.












Click it and Unblock the Notifications