మీ కుయుక్తులు ఇక్కడ పనిచేయవు: ‘నీలకంఠ కిడ్నాప్’పై షర్మిలకు ఎమ్మెల్యే సదిరెడ్డి కౌంటర్
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. తెలంగాణ ప్రజలు మీ కుయుక్తులు, డ్రామాలను నమ్మరంటూ షర్మిలనుద్దేశించి వ్యాఖ్యానించారు. హుజూర్నగర్ నియోజకవర్గం పర్యటనలో నేరేడుచెర్ల మండలం మేడారం వెళ్లిన షర్మిలకు ఒక్క నిరుద్యోగి కూడా కనపడలేదని అన్నారు.
అయితే, శానంపూడి సైదిరెడ్డి కిడ్నాప్ చేయించాడని షర్మిల చెప్పడం విడ్డూరంగా ఉందని షర్మిలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంపై ఏర్పడిన రాష్ట్రమని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని సైది రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు షర్మిల వచ్చి ఉద్ధరించేదేమీ లేదని హితవు పలికారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి లేకుండా.. కృష్ణా బోర్డు నియామకాలకు వ్యతిరేకంగా.. 4 టీఎంసీల నీరు ఆంధ్రాకు తరలిస్తున్నారన్న సైదిరెడ్డి.. దీనిపై షర్మిల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, నేరేడుచర్ల మండలం మేడారంలో షర్మిల పర్యటించిన విషయం తెలిసిందే. ఆ గ్రామానికి చెందిన నీలకంఠసాయి అనే నిరుద్యోగి.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో అతడ్ని పరామర్శించాలని షర్మిల భావించారు. కానీ, నీలకంఠస్థాయి కుటుంబం ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వం, ఎమ్మెల్యే సైదిరెడ్డిపై షర్మిల అనుచరులు విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే సైదిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాగా, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీ పెట్టేందుకు షర్మిల సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. జులై నెలలో తన కొత్త పార్టీని ప్రకటిస్తామని ఆమె ఇప్పటికే తెలిపారు. కేసీఆర్ సర్కారుపై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తుండగా.. ఆ పార్టీ నేతలు కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు.