నో ప్లాస్టిక్: తిరుమల కొండపై సంపూర్ణ నిషేధం.. ఆఖరికి షాంపు ప్యాకెట్ కూడా..
తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తున్నామని టీటీడీ ప్రకటించింది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి రానుందని వెల్లడించింది. కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా పెట్టనున్నట్లు తెలిపింది. అలిపిరి టోల్గేట్ దగ్గరే తనిఖీలు చేయనున్నారు.
అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతిస్తామన్నారు. అలాగే కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇప్పటికే ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్లు నిషేధించిన టీటీడీ.. బుధవారం నుంచి పూర్తి స్తాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయనుంది. చివరకు ఆట వస్తువులపై వచ్చే ప్లాస్టిక్ కవర్లపైనా బ్యాన్ విధించారు. షాంపూ ప్యాకెట్లు కూడా అనుమతించరు.
కొండపై ఉన్న హోటళ్లు, దుకాణదారులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమావేశం అయ్యారు.జూన్ 1 నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నామని.. దుకాణదారులు, హోటళ్లు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామన్నారు. చివరికి షాంపూ ప్యాకెట్లు కూడా అమ్మకూడదని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు, దుకాణదారులు సహకరించాలని కోరారు.
తిరుమల తరహాలో రాష్ట్రంలో గల దేవాలయాల్లో ఇక నుంచి ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి ఇకపై అనుమతించబోమని అంటున్నారు. ఆలయానికి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్నగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించారు. జూలై 1 నుంచి.. ప్రధాన ఆలయాలు అన్నింటిలో ప్లాస్టిక్ నిషేధిస్తారు.