‘సీతయ్య సేవా సమితి’ సొంత డబ్బులతో అంబులెన్స్, ఆదర్శం ఈ సర్పంచ్
కరోనా సమయంలో ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ తప్పనిసరి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా.. సర్కార్ దవాఖానల్లో బెడ్లు ఉండటం లేదు. కొందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ప్రైవేట్ అంబులెన్సులు అయితే.. జాలి, దయ, కనికరం లేకుండా.. ముక్కుపిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తున్నారు. ఇబ్బందులను గమనించిన సర్పంచ్ ఒకరు తన సొంత డబ్బులతో అంబులెన్స్ కొనుగోలు చేశారు. ఆ వివరాలెంటో తెలుసుకుందాం పదండి.
అంబులెన్స్ కొనుగోలు
కరోనా రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సమయానికి అంబులెన్స్ రాక కొందరు.. అంబులెన్స్ వచ్చినా అడిగినంత ఇచ్చుకోలేక మరికొందరు పాట్లు తప్పడం లేదు. కృష్ణా జిల్లా అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య గ్రామస్తుల కోసం సొంత డబ్బుతో అంబులెన్స్ కొనుగోలు చేశారు. కరోనా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవడంతో నాలుగు లక్షలు పెట్టి అంబులెన్స్ కొనుగోలు చేశారు.
వాహనం కోసం పాట్లు
గ్రామంలో అంబులెన్స్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డామని సీతయ్య తెలిపారు. 108 ఫోన్ చేసినా సరైన సమయానికి వచ్చేది కాదని.. కొన్ని సార్లు అసలు రాలేదని అన్నారు. కరోనా రోగులను ఆటో, కార్లలో తీసుకెళ్లామని వాటిలో ఆక్సిజన్ లేకపోవడంతో వారు నరకయాతన పడ్డారని తెలిపారు. దీనికి పరిష్కారం అంబులెన్స్ కొనుగోలు చేయడమేనని భావించానని వివరించారు. పంచాయతీ డబ్బులతో కొనుగోలు చేయడం ఇబ్బంది అని.. వీలు కానందున సొంత డబ్బులు వెచ్చించి వాహనం తీసుకున్నామని పేర్కొన్నారు.
Recommended Video
జాలి, దయ లేకుండా వసూల్
ప్రైవేట్ అంబులెన్స్లను అడిగితే 100 కిలోమీటర్లకు కూడా రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఛార్జ్ చేస్తున్నారని సీతయ్య వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు తనవంతు సాయం చెయ్యాలని అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు అంబాపురం గ్రామంలో 100 మంది కరోనా బారినపడ్డారని సీతయ్య తెలియచేశారు. అంబులెన్స్ తమ గ్రామంతోపాటు పక్క గ్రామాల్లో కూడా సేవలు అందిస్తుందని ఎవరికైనా అవసరం ఉంటే సీతయ్య సేవ సమితి సభ్యులను సంప్రదించాలని సూచించారు.