కిరణ్కు 'హోం' ట్విస్ట్: ప్లాన్ ప్రకారమే సభకు అడ్డు
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విభజన బిల్లు అంశం ముగిసినట్లేనని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ నెల 30వ తేదీతో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీకి ఇచ్చిన గడువు ముగియనుంది. ఆ తర్వాత తమ పని మొదలు పెట్టేందుకు హోంశాఖ సిద్ధంగా ఉందట. ముసాయిదా బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసు ప్రకారం... అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఓటింగ్ జరిగే అవకాశం లేనందున తమ పని తాము చేసుకోవచ్చునని హోంశాఖ అభిప్రాయపడుతోందట.
ఇందులో భాగంగా ఇప్పటి వరకు అసెంబ్లీలో జరిగిన చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు అనధికారికంగా తెప్పించుకుంటోంది. అసెంబ్లీ నుండి సమాచారం వచ్చేలోగా తుది బిల్లు రూపకల్పన పనిని పూర్తి చేయాలని హోంశాఖ భావిస్తోంది. గడువు పెంపు కోసం కిరణ్ లేఖ రాసినా ఇచ్చే పరిస్థితి లేదంటున్నాయి. మరోవైపు కిరణ్ ప్రవేశ పెట్టన తీర్మానం సభలో చర్చకు రాకుండా హోంశాఖ ఢిల్లీ నుంచే మంత్రాంగం నడుపుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
30వ తేదీ వరకు సభ నడవకుండా చూస్తే మిగతా విషయం తాము చూసేందుకు సిద్దమని తెలంగాణ ముఖ్య నేతలకు హోంశాఖ వర్గాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే మంత్రులు స్పీకర్ పోడియం ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కిరణ్ నోటీసు పైన తీర్మానం ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశ పెట్టే అవకాశం లేదంటున్నారు. ఏ బిల్లును అయినా పార్లమెంటులో ప్రవేశ పెట్టే వరకు ముసాయిదా బిల్లే అంటారని, ముఖ్యమంత్రి దీనిపై అనవసర రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఢిల్లీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారట.
విధానసభ ఆమోదించినా, తిరస్కరించినా రాజ్యాంగంలోని 3వ అధికరణం కింద రాష్ట్ర విభజన అధికారం కేంద్రానికి ఉంటుందని చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 11న లోక్సభలో, 12న రాజ్యసభలో బిల్లును ప్రతిపాదించేందుకు హోంశాఖ అధికార్లు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా, విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఇప్పటికే కొన్ని పిటిషన్లు దాఖలైన సంగతి విదితమే. 30 తరువాత మరికొన్ని పిటీషన్లు దాఖలయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.