మరో ఘనత: కిలిమంజారోపై మువ్వన్నెల జెండా, ‘కెసిఆర్’
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులు మరో సారి తమ సత్తా సాటారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమాంజారో పర్వతంపై స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. పర్వత సానువులను జనగణమన గీతాలాపనతో ప్రతిధ్వనింపజేస్తూ భారత కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. అత్యంత పిన్న వయసులో ఎవరెస్ట్ను అధిరోహించిన పూర్ణ మాలావత్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఈ ఘనత సాధించారు.
ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉన్న 19,341 అడుగుల కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఆగస్టు 8న మెదక్జిల్లా నుంచి విద్యార్థులు బయల్దేరారు. శనివారం కిలిమాంజారో శిఖరాగ్రాన్ని చేరుకుని అక్కడ 20 అడుగుల మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. తాజాగా సోమవారం పర్వతంపై సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు.
తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని, పాఠశాలల లోగోలతోపాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫోటోను ప్రదర్శించారు. ఈ బృందం.. ఆగస్టు 18న హైదరాబాద్కు చేరుకోనుంది. మొత్తం 21 మంది ఈ బృందంలో ఉండగా, అందులో 17 మంది కిలిమాంజారో శిఖరాన్ని చేరుకున్నారు. అందులో 14 మంది బాలికలు, మహిళలే.
ఆగస్టు 10న టాంజానియాలోని మోషి పట్టణం నుంచి మొదలైన వారి సాహస యాత్ర.. దాదాపు 33 గంటల ట్రెక్కింగ్ అనంతరం శిఖరాన్ని అధిరోహించడంతో పూర్తయింది. ఈ బృందంలో పూర్ణతోపాటు తింబిగిరి మంజుల, గొడుగు రమ్య, బెగారి అనసూయ, మర్కంటి నాగమణి, లునావత్ మౌనిక, గామని నర్సమ్మ, లంబాడి బూలి, జాల కవిత, ఈర జ్యోతి, చిలుక కమల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలుకు చెందిన వావిళ్ల పూజ, దుగ్గె మౌనిక, రంగగళ్ల బాల్రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ల నుంచి నల్లపోతుల క్రిష్ణ, గుగులోత్ సింధులు ఉన్నారు.
వీరితోపాటు గైడ్గా రాజి తమ్మినేని, పర్వతారోహణలో అర్జున అవార్డు గ్రహీత బిమల్ నేగి, పద్మశ్రీ అవార్డు గ్రహీత గురుమయూం అనితాదేవి, ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీ జీఆర్ రాధిక, మరో అర్జున అవార్డు గ్రహీత బీ శేఖర్బాబు ఉన్నారు.
కిలిమంజారోపై త్రివర్ణ పతాకం
తెలంగాణ విద్యార్థులు మరో సారి తమ సత్తా సాటారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమాంజారో పర్వతంపై స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. పర్వత సానువులను జనగణమన గీతాలాపనతో ప్రతిధ్వనింపజేస్తూ భారత కీర్తి పతాకాన్ని ఎగరవేశారు.
కెసిఆర్ చిత్రపటంతో..
శనివారం కిలిమాంజారో శిఖరాగ్రాన్ని చేరుకుని అక్కడ 20 అడుగుల మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. తాజాగా సోమవారం పర్వతంపై సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించారు.
పిన్న వయస్కురాలు నర్సమ్మ
కిలిమాంజారోను అధిరోహించినవారిలో అతిపిన్న వయస్కురాలు గామని నర్సమ్మ (12). నర్సమ్మ కొల్చారం కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతోంది. కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన గామని సంజీవులు, జమున దంపతుల పెద్ద కూతురు నర్సమ్మ.
బృందంలో వెల్దుర్తి బాలికలు
కిలిమంజారోను అధిరోహించినవారిలో వెల్దుర్తి బాలికలు ఇద్దరు, ఒక పీఈటీ ఉన్నారు. దామరంచ గ్రామానికి చెందిన కుర్మ మైసమ్మ, రాజు దంపతుల కూతురు జ్యోతి (14), మానేపల్లి గ్రామానికి చెందిన జాల రాజమణి కూతురు కవిత(14) స్థానిక కస్తూ ర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. పీఈటీ కమల రామాయంపేట వాసి. కాగా, కమలకు 18న వివాహం జరుగాల్సి ఉంది. కిలిమాంజారో అధిరోహణం నేపథ్యంలో ఆమె తన వివాహాన్ని 26వ తేదీకి వాయిదా వేసుకున్నారు.