నారాయణ వర్సెస్ వెలాసిటీ: సినిమా సన్నివేశాలే...
హైదరాబాద్: రెండు కార్పోరేట్ కాలేజీల మధ్య ప్రచ్చన్న యుద్ధం ముదురుతోంది. అది లెక్చరర్లను ఎత్తుకెళ్లడం దగ్గరి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయడం వరకు వెళ్లింది. సినిమా సన్నివేశాలను తలపించే విధంగా ఎక్కువ వేతనాలను చెల్లిస్తామంటూ లెక్చరర్లను ఎత్తుకెళ్లే సంస్కృతి కొనసాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.
నారాయణ కాలేజీలో పనిచేస్తున్న కొంత మందిని వెలాసిటీ కార్పొరేట్ జూనియర్ కాలేజీలు రిక్రూట్ చేసుకుని వేతనాలను ఖరారు చేసింది. అందుకు రెట్టింపు చెల్లిస్తామని హామీ ఇచ్చి నారాయణ విద్యాసంస్థలు మళ్లీ వారిని తమ కాలేజీలకు తీసుకువెళ్లాయి. దీంతో వెలాసిటీ విద్యాసంస్థ తమ లెక్చరర్లు కనిపించడం లేదంటూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నారాయణ విద్యాసంస్థల వెనుక ఆంధ్రాకు చెందిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఉండగా, తెలంగాణలోని వెలాసిటీ విద్యాసంస్థల వెనుక అంతకన్నా బలమైన మరో మంత్రి ఉన్నట్లు సమాచారం. దీంతో ఇది ఇద్దరు మంత్రుల మధ్య పోరుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. లెక్చరర్ల అదృశ్యంపై సమాచారం కోరగా అలాంటిది ఏమీ లేదని ఏదో చిన్న విషయం అన్నట్టు కొట్టిపారేశారని ఓ వార్తాపత్రిక రాసింది.
గతంలో నారాయణ సంస్థలకు, చైతన్య సంస్థలకు మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి, అపుడు కూడా హైదరాబాద్కు చెందిన ఒక మంత్రి మధ్యవర్తిత్వంతో పరిష్కారం అయ్యాయి. తర్వాత ఆ రెండు సంస్థల యాజమాన్యాల మధ్య అవగాహన కుదరడంతో ఇరు సంస్థల యాజమాన్యాలు సంయుక్తంగా 'చైనా' (చైతన్య ప్లస్ నారాయణ) సంస్థలను ప్రారంభించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాల్లో నారాయణ విద్యాసంస్థలు, శ్రీ చైతన్య విద్యాసంస్థలే రాజ్యమేలడంతో పాటు జాతీయ స్థాయిలో విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 'వెలాసిటీ' పేరుతో కార్పొరేట్ జూనియర్ కాలేజీల సంస్థ ఆవిర్భవించింది.
ఈ సంస్థను నెలకోల్పిన ముగ్గురూ ఎం రాధాకృష్ణ (గణితం), ఎస్ వంశీ కృష్ణ (ఫిజిక్స్) , వై లారెన్స్ (కెమిస్ట్రీ) మూడు సబ్జెక్టుల్లో నిష్ణాతులు. వీరు చైనా (శ్రీచైతన్య-నారాయణ) సంస్థలో దశాబ్దాల తరబడి పనిచేసిన వారు. అయితే ఈ సంస్థ ఏర్పాటు వెనుక ఒక ప్రముఖ మంత్రి సహకారం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయని ఆ తెలుగు దినపత్రిక రాసింది.
ఈ ఏడాది సిబ్బంది రిక్రూట్మెంట్లో భాగంగా నారాయణలో పనిచేస్తున్న అచ్యుత్రావును రెట్టింపు వేతనానానికి వెలాసిటి రిక్రూట్చేసినట్టు సమాచారం. అయితే వెలాసిటీకి వెళ్లిన అచ్యుత్రావును మరింత వేతనం అదనంగా ఇస్తామని చెప్పి నారాయణ విద్యాసంస్థలు మళ్లీ ఆయనను వెనక్కి తీసుకుని వెళ్లిందని అంటున్నారు. దాంతో ఏడాది పాటు పనిచేస్తానని అంగీకరించిన అచ్యుత్రావు కనిపించడం లేదంటూ మాదాపూర్ పోలీసులకు వెలాసిటీ విద్యాసంస్థ ఫిర్యాదు చేసిందని తెలిసింది.
అలాగే బెంగలూరులో నారాయణ సంస్థల్లో పనిచేస్తున్న నాగేశ్వరరావును సైతం హైస్కూళ్ల విభాగానికి ఒక కార్పొరేట్ సంస్థ రిక్రూట్చేసుకోగా, ఆయనను సైతం తిరిగి నారాయణ విద్యాసంస్థ వెనక్కి తీసుకువెళ్లింది. దానిపై కూడా పెద్ద ఎత్తున రగడ నడుస్తోందని తెలిసింది.
మొత్తం మీద, కార్పోరేట్ విద్యాసంస్థల వ్యాపార పోటీ తీవ్రమై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుత వార్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది.