ఇంతమంది చేతులెత్తటం ఫస్ట్ టైం! టి స్పీకర్, నవ్వులు
హైదరాబాద్: ఒకే అంశం పైన మాట్లాడేందుకు ఇంతమంది సభ్యులు చేతులు ఎత్తుతూ ఆసక్తి చూపడం సభాపతిగా తొలిసారి చూస్తున్నానని తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనా చారి బుధవారం వ్యాఖ్యానించారు.
బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను పునర్విభజన చేయాలన్న అంశంపై ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ... జిల్లాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
దీనిపై సభలో ఉన్న టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఎమ్మెల్యేల్లో చాలామంది సభ్యులు మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు. తమకు అవకాశమివ్వాలన్నారు.
దీంతో స్పీకర్.. తాను మొదటిసారి ఎక్కువ మంది మాట్లాడాలనుకోవాలని కోరడం చూస్తున్నానని, ఎమ్మెల్యేలు అందరూ తమ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు ఉన్నారని, ఎంతమందికి అవకాశం ఇవ్వగలమన వ్యాఖ్యానించారు. దీంతో, సభలో అందరూ నవ్వేశారు.
ఇదిలా ఉండగా, దేశంలో ఉన్న 681 జిల్లాల్లో సగటు జనాభా సుమారు 19 లక్షల మంది కాగా తెలంగాణ జిల్లాల్లో 35 లక్షలుగా ఉందని, పరిపాలన సౌలభ్యం, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా జిల్లాల విభజనకు ప్రభుత్వం నిర్ణయించిందని మహమూద్ అలీ వెల్లడించారు.
నూతన జిల్లాల ఏర్పాటుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. కొన్ని ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ యంత్రాంగాన్ని చేరుకోటం ఇబ్బందికరంగా ఉందని, విస్తీర్ణం రీత్యా కూడా ఇబ్బందులు వస్తున్నాయన్నారు.
ఆయా అంశాలను పరిశీలించిన అనంతరం జిల్లాల విభజన చేయాలని ప్రభుత్వం గుర్తించిందని, ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని నియమించామని, నివేదిక అందిన అనంతరం ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, ఆ తర్వాతే జిల్లాల సరహద్దులను నిర్ణయిస్తామన్నారు.