జగన్తో బిజెపి బంధం ఏనాటిదో: గుట్టు విప్పిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపిపై ఇన్నాళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తిని ఒక్కసారిగా వెల్లడించారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై, బిజెపీపై చేసిన వ్యాఖ్యలు కొత్త విషయాలను వెల్లడించాయి.
చంద్రబాబు మాటలను బట్టి బిజెపి చాలా కాలంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు అర్తమవుతోంది. అప్పటి నుంచే ఆయన బిజెపికి దూరమవుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని కూడా చంద్రబాబు మాటలను బట్టి స్పష్టమవుతోంది.
లింకులపై చంద్రబాబు ఏమన్నారు...
బీహార్ గవర్నర్గా ఉన్నప్పుడే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రామ్నాథ్ కోవింద్ను ఆయన బీహార్ గవర్నర్గా ఉన్నప్పుడే కలిశారని చంద్రబాబు అన్నారు. శాసనసభలో ప్రత్యేక హోదాపై, విభజన హామీలపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు పలు విషయాలు వెల్లడించారు.
చాలా ఆలస్యంగా చెప్పారని...
రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ పేరును ఖరారు చేస్తున్నట్లు తనకు ఆలస్యంగా చెప్పారని చంద్రబాబు అన్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తనకు ఫోన్ చేసి చెప్పేంత వరకు కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలియదని ఆయన అన్నారు. ఎన్డీఎలో ఉన్నప్పటికీ రాష్ట్ర పతి అభ్యర్థి ఎవరో తనకు తెలియలేదని అన్నారు. దీన్ని బట్టి బిజెపి చంద్రబాబును వ్యూహాత్మంగా దూరం చేస్తూ వచ్చిందని భావించవచ్చు.
అది మంచిది కాదు..
కేసుల్లో మొదటి, రెండో ముద్దాయిలు అయిన జగన్, విజయసాయి రెడ్డి అధికారానికి అంత దగ్గరగా ఉండడం మంచిది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోడీతో జగన్ భేటీపై, విజయసాయి రెడ్డికి బిజెపితో ఉన్న సంబంధాలపై ఆయన ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు. జగన్కు బిజెపి దగ్గరవుతూ తనను దూరం పెడుతూ వచ్చిందనే ఆవేదన చంద్రబాబు మాటల్లో కనిపించింది.
జగన్తో మోడీ భేటీ...
రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలోనే వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. మోడీతో భేటీ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ - బిజెపి ఖరారు చేసే రాష్ట్రపతి అభ్యర్థికి తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో జగన్కు తెలిసిన తర్వాతనే చంద్రబాబుకు తెలిసిందనేది అర్థమవుతోంది.