మొండికేస్తున్న తెలంగాణ నేతలు, దిగిరాని హైకమాండ్
తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన వారిని మరింతగా రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు కె. కేశవ రావు చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆజాద్పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆజాద్కు బుద్ధీజ్ఞానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పైగా, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన దీక్షా శిబిరంలో ప్రసంగిస్తూ స్పష్టం చేశారు. రాజీనామాలను వెనక్కి తీసుకోబోమని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కథానాయకులు ప్రజలేనని ఆయన అన్నారు. ఈ నెల 31వ తేదీలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రకటన చేయకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, అప్పుడు ఆపే శక్తి ఎవరికీ ఉండదని ఆయన హెచ్చరించారు.
బుధవారం ప్రారంభమైన 48 గంటల దీక్షలో ముగ్గురు మంత్రులు, ఏడుగురు పార్లమెంటు సభ్యులు, 14 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న నాయకులంతా తమ పార్టీ అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రకటన చేసే వరకు వెనక్కి తగ్గబోమని చెప్పారు. గులాం నబీ ఆజాద్పై నాయకులంతా విరుచుకుపడ్డారు.