సిబిఐ దర్యాప్తు: ప్రజల్లోకి చంద్రబాబు, టిడిపి నేతలు
మొత్తం పది అంశాలపై కరపత్రం వేసే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. దాదాపు 60 పేజీల కరపత్రం వేసి ప్రజలకు పంచి పెట్టాలని నిర్ణయించుకున్నారు. వైయస్ జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయి తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి విజయమ్మ చేత పిటిషన్ వేయించారని మాత్రమే చంద్రబాబు గానీ ఆయన పార్టీ నాయకులు గానీ చెప్పే స్థితిలో ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, గతంలో వైయస్సార్ ప్రభుత్వం హయాంలో విచారణలు వేయించారని, ఏదీ నిరూపితం కాలేదని మాత్రమే చెప్పగలరు. అంతే తప్ప హైకోర్టు ఆదేశాలను తప్పు పట్టే అవకాశం ఉండదు.
అయితే, మొత్తంగా వైయస్ జగన్, గాలి జనార్దన్ రెడ్డిలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న తరుణంలో తనపై హైకోర్టు ఆదేశాలు జారీ కావడం పిడుగుపాటు వంటిదే. వారిద్దరిని చంద్రబాబు ఎడాపెడా వాయిస్తూ వచ్చారు. దానికి బ్రేకులు వేయాల్సిన స్థితిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును వసూల్ రాజాగా అభివర్ణిస్తూ తెరాస పార్టీయే కాదంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎదురుదాడికి స్వస్తి చెప్పి తనను తాను సమర్థించుకోవాల్సిన స్థితిలో పడ్డారు. ఈ విషయంపైనే ఆయన ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.