తప్పు చేయమని వైఎస్ చెప్పలేదు, నేనూ అంతే: భాను
తప్పు చేయాలని తాను ఒత్తిడి తీసుకు వచ్చింది నిజమే అయితే దేవానంద్ అప్పుడే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దేవానంద్ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి భయపడి ఉంటే ఆయన మరణం తర్వాత గానీ, తాను ఆంధ్రప్రదేశ్ను వదిలి వెళ్లాక గానీ ఫిర్యాదు చేయవచ్చు కదా అని అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలు పూర్తి నిరాధారం అన్నారు. దేనికైనా సాక్ష్యాలు ఉండాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఎవరో చేసిన తప్పులు తనపై రుద్దితే వారిపై న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటాయన్నారు. కొన్ని పత్రికలలో తాను అప్పటి కలెక్టర్లపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయని, ఇవి తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. తన వృత్తి జీవితంలో గానీ, ఐఏఎస్లో చేరినప్పటి నుండి ఎప్పుడూ ఏ అధికారికీ తప్పుడు పని చేయమని చెప్పలేదన్నారు. దేవానంద్ చేసినట్లు రాసిన ఆరోపణలు తాను ఖండిస్తున్నానని అన్నారు.