నన్ను కొనే మొగోడున్నాడా, ఇదో పదవా: దేవేందర్
ఆనారోగ్యం కారణంగా డాక్టర్ అపాయింట్మెంట్ ఉండడం వల్లనే రాజ్యసభకు హాజరు కాలేదని, పైగా బిఎస్పీ మద్దతుతో ప్రభుత్వం గెలిచే పరిస్థితి ఉందని, దాంతో ఓటింగును తాము తేలిగ్గా తీసుకున్నామని ఆయన చెప్పారు. రాజ్యసభకు గైర్జాజరవుతున్న విషయాన్ని తాను ముందే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి చెప్పానని ఆయన అన్నారు.
ఇంత రాద్ధాంతం చేస్తారనుకుంటే డాక్టర్ అపాయింట్మెంటును రద్దు చేసుకుని ఉండేవాడినని ఆయన అన్నారు. తన గైర్జాజరుకు ప్రచార సాధనాలు ఎక్కువ ప్రచారం ఇస్తున్నాయని, అనవసంగా రాద్దాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు.
రాజ్యసభలో ఓటింగుకు గైర్హాజరు కావడం తప్పని తాను భావించడం లేదని మరో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి అన్నారు. వ్యక్తిగత కారణాల వల్లనే తాను హైదరాబాదుకు రావాల్సి వచ్చిందని ఆమె వరంగల్లో అన్నారు. తన సమీప బంధువు ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ వచ్చానని ఆమె అన్నారు. తాను పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తానని ఆమె అన్నారు. ఎఫ్డిఐలను తాము సీరియస్గా తీసుకోలేదని చెప్పారు.
రాజ్యసభకు గైర్హాజరు కావడం వెనక ఏ విధమైన రాజకీయ దురుద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెసుతో లాలూచీ పడాల్సిన అవసరం తనకు లేదని ఆమె అన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబున నాయుడిని కలిసి వివరణ ఇస్తానని చెప్పారు.