'ప్రత్యేకం': తెలంగాణ ఇస్తే 20కి పైగా రాష్ట్రాల డిమాండ్!
తెలంగాణ ఇస్తే గూర్ఖాల్యాండ్ ఇవ్వాల్సిందేనని ఇప్పటికే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎపి విభజన జరిగితే పలు రాష్ట్రాల్లో ప్రత్యేకవాదులు కార్యాచరణకు దిగుతారని అంటున్నారు. ఎపి విభజన జరిగితే దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ప్రత్యేక డిమాండ్లు వినిపించే అవకాశాలున్నాయని అంటున్నారు. పన్నెండేళ్ల క్రితం బిజెపి ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు కూడా చాలా డిమాండ్లు వినిపించాయి.
ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా, గుజరాత్.. ఇలా చాలా ప్రాంతాల్లో ప్రత్యేక డిమాండ్లు వినిపిస్తాయంటున్నారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపిని నాలుగు రాష్ట్రాలుగా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. శాసన సభలో తీర్మానం కూడా పాస్ చేశారు. తెలంగాణ మాత్రమే కాకుండా ఏ రాష్ట్ర విభజన జరిగినా పలుచోట్ల ప్రత్యేక డిమాండ్స్ కచ్చితంగా వినిపిస్తాయంటున్నారు.
బీహార్లో మిథిలాంచల్, గుజరాత్లో సౌరాష్ట్ర, కర్నాటకలో కూర్గ్, ఉత్తప్రదేశ్లో హరిత ప్రదేశ్, పూర్వాంచల్, అవధ్, పశ్చిమ బెంగాల్లో గూర్ఖాల్యాండ్, జమ్మూ కాశ్మీర్లో లడక్, తమిళనాడులో కొంగునాడు, ఒడిషాలో కోసల్, మధ్యప్రదేశ్లో వింధ్య ప్రదేశ్, మహారాష్ట్రలో విదర్భ, అస్సాంలో బోడోలాండ్, మేఘాలయలో గారోలాండ్లు ఉన్నాయి.
ఇక రెండు మూడు రాష్ట్రాల్లోని ప్రాంతాలను కలిపి కూడా ప్రత్యేక డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ - మధ్యప్రదేశ్ల నుండి బుందేల్ఖండ్, ఉత్తర ప్రదేశ్ - బీహార్ - ఛత్తీస్గఢ్ల నుండి బోజ్పూర్, పశ్చిమ బెంగాల్ - అస్సాంల నుండి గ్రేటర్ కూచ్ బీహార్, అస్సాం - నాగాలాండ్ల నుండి దిమరాజీ, కర్నాటక - కేరళల నుండి తుళునాడు, ఉత్తర ప్రదేశ్ - మధ్యప్రదేశ్ - మహారాష్ట్రల నుండి ప్రజ్ ప్రదేశ్ల డిమాండ్స్ ఉన్నాయి.
అయితే తెలంగాణ ఏర్పడితే కచ్చితంగా అన్నిచోట్ల బలమైన డిమాండ్స్ వినిపిస్తాయని కూడా చెప్పలేం. అయితే చాలాచోట్ల మాత్రం ఉద్యమం ఊపందుకునే అవకాశాలున్నాయంటున్నారు. అయితే తెలంగాణకు, మిగిలిన రాష్ట్రాలకు పోలిక లేదనే విషయాన్ని గుర్తించాలని తెలంగాణవాదులు చెబుతున్నారు.