వైయస్ పదవీ కాంక్షతోనే, కెసిఆర్ తప్పు లేదు: నాదెండ్ల
రాష్ట్ర విభజన కాలేదని, కాదని.... తాను చెప్తున్నానని, అధిష్టానం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందని, ప్రజాభిప్రాయాలను పార్టీలు చెప్పలేవని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయం వెనక్కి తీసుకుని.. ఇరువైపులా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ప్రజల నాడిని పట్టుకోవడంలో ఒక్క సిపిఎం తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ విఫలమయ్యాయని, ప్రజల కోరికలను అవి తెలుసుకోలేకపోయాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విభజనను ఆపాలని కాంగ్రెస్ హైకమాండ్కు ఏఐసిసి సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం మార్చుకోవడంలో తప్పులేదని, అది కూడా రాజనీతిలో భాగమని, నిర్ణయాలు మార్చుకున్న పరిణామాలు గతంలో ఎన్నో జరిగాయని పేర్కొన్నారు.
ఈ అంశంపై రాష్ట్రంలో అన్ని వర్గాలనూ సంప్రదించి నివేదిక ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీ మాత్రమేనని నాదెండ్ల అన్నారు. విభజన విషయంలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్పు ఏమీ లేదని, ఆయన ప్రత్యేక తెలంగాణ అడగలేదని.. రెండో ఎస్సార్సీ కోసం నాటి పిసిసి అధ్యక్షుడి వద్ద ఒప్పందంపై సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ అనే రాష్ట్రం లేదని, విశాలాంధ్ర ఉద్యమ సమయంలో చెన్నారెడ్డి 8 జిల్లాలను కలిపి ఒక రాష్ట్రంగా ఇవ్వాలని కోరినా, అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు అంగీకరించలేదని అన్నారు. తాను 1952లోనే హైదరాబాద్కు చదువుకోవడానికి వచ్చానని, అప్పట్లో తమకు ఇలాంటి సమస్యలు లేవని తెలిపారు. పార్టీలు విఫలమవ్వడం వల్లనే ప్రజలు రోడ్డెక్కుతున్నారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్రంలో బలహీనపడలేదన్నారు.
సిఎం ఎదుట సమైక్య నినాదాలు
సమైక్యాంధ్ర కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకు రావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యవాదులు పట్టుబట్టారు. మంత్రి రఘువీరా రెడ్డి తల్లి వైకుంఠ సమారాధనలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం కిరణ్, బిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు హెలికాప్టర్లో నీలకంఠాపురం వచ్చారు. అక్కడ వారి ఎదుట సమైక్యవాదులు సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.