పార్లమెంటులో అదే గందరగోళం, టిడిపి ఎంపీలపై వేటు?
అంతకుముందు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ సీమాంధ్ర టిడిపి ఎంపీలతో భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై వారు సుషఅమ దృష్టికి తీసుకు వెళ్లారు.
కాగా, రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఈ రోజు లోక్సభలో అరుదైన విషయం చోటుచేసుకునే అవకాశముంది. విభజనకు వ్యతిరేకంగా పది రోజులుగా సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న తెలుగుదేశం ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శివ ప్రసాద్లను సభ నుంచి సస్పెండ్ చేయక తప్పదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.
పార్లమెంట్ సమావేశమైనప్పటి నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆహార భద్రత బిల్లును లోక్సభలో ఆమోదింపజేసేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. అయితే మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును ఆమోదింపజేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
మంగళవారం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేసి బిల్లుపై చర్చ ప్రారంభించి సాయంత్రంలోగా ఆమోదం పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టిడిపి సభ్యులు యథాప్రకారం స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలితే వారిని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలున్నాయి.