చంద్రబాబుకు షాక్: అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన అన్నాడియంకె
Recommended Video
చెన్నై: ఇరవై నాలుగు గంటలకు కూడా గడవకుండానే అన్నాయడియంకె మాట మార్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది.
తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి అన్నాడియంకె మద్దతు ఇస్తుందని శుక్రవారం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు చెప్పుకున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తూ అన్నాడియంకె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో తమకేమీ సంబంధం లేదని, అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని లోకసభలో అన్నాడియంకె పక్ష నేత పి. వేణుగోపాల్ దక్కన్ క్రానికల్తో చెప్పారు. అన్నాడియంకెకు 37 మంది లోకసభ సభ్యులున్నారు.
తమను వైసిపి నాయకులు సంప్రదించారని, అయితే తాము మద్దతు ఇవ్వబోమని చెప్పాని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని తాము నిరసించినప్పుడు టిడిపి గానీ వైసిపి గానీ మద్దతు తెలుపలేదని ఆయన గుర్తు చేశారు.
తాము కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు ఇవ్వని పార్టీలకు తాము ఇప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆయన అడిగారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు టీవీ చానెల్తో కెసి పలనిసామిపై అన్నాడియంకె వేటు కూడా వేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కెసి పలనిసామి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిసామి, డిప్యూటీ సిఎం ఓ పన్నీర్ సెల్వం శుక్రవారం సాయంత్రం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.
రాజకీయ కారణాలతో టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తోందని తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్ విమర్శించారు.నాలుగేళ్ల పాటు టిడిపి బిజెపితో ఉదని, అకస్మాత్తుగా బయటకు వచ్చి అవిశ్వాసం గురింంచి మాట్లాడుతోందని అన్నారు.