అమర్నాథ్ యాత్ర: 84 మంది ఏపీ యాత్రికులు సురక్షితం, మరో ఇద్దరి కోసం గాలింపు
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 16 మంది మరణించారు. మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. కాగా, ఇప్పటికే దాదాపు 15వేల మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. విరిగిపడిన కొండచరియల్లో దాదాపు 40 మంది వరకూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్కు చెందిన 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని, మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులు, వారి కుటుంబీకుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేయడంతోపాటు ఉన్నతాధికారులను శ్రీనగర్కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.అమర్నాథ్ క్షేత్రం సమీపంలో ఆకస్మికంగా సంభవించిన వరద విపత్తులో ఇప్పటివరకు 16 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
వంద మందికిపైగా గాయపడగా వారికి వివిధ ప్రాంతాల్లో చికిత్సలు అందిస్తున్నారు.

గల్లంతైన మరో 40మంది కోసం సైన్యం, కేంద్ర బలగాలు, పోలీసులు నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఏపీకి చెందిన ఇద్దరి కోసం జమ్మూ అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ను శ్రీనగర్కు పంపించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం నుంచి అమర్నాథ్ వెళ్లిన యాత్రికులకు సహాయం అందించేందుకు 1902 హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
కాగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. కాస్త వాతావరణం సానుకూలంగా మారిన తర్వాత ప్రారంభించే అవకాశం ఉంది. ఈక్రమంలో వేలాది మంది యాత్రికులు అమర్నాథుడి దర్శనం కోసం అక్కడే వేచివున్నారు.












Click it and Unblock the Notifications