తెలంగాణలో ఎమ్మెల్సీ చిచ్చు: బాబుపై అరికెల అలక, రాజీనామా యోచన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో మరో షాక్ తగలనుందా? అలాగే కనిపిస్తోంది. నిన్నటి వరకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రబాబుకు చిక్కులు తెస్తే... తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ టీడీపీలో విభేదాలు తీసుకు వచ్చాయి.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జూన్ 1న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ - బీజేపీలు ఒక సీటు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటివలి కాలంలో టీడీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. వారు ఉంటే కనుక టీడీపీ అభ్యర్థి ఎన్నిక ఖాయమయ్యేది. అయినప్పటికీ, తాము గెలుస్తామని టీడీపీ - బీజేపీ నేతలు చెబుతున్నారు.
అయితే, ఎమ్మెల్సీ సీటు కోసం అరెకెల నర్సా రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మధ్య చివరి వరకు పోటీ కనిపించింది. చివరకు వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో, అరికెల అలిగారు. అధిష్టానం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.
తనకు అవకాశం ఇవ్వనందుకు ఆయన టీడీపీకీ రాజీనామా చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే టీడీపీకి తెలంగాణలో మరో పెద్ద షాక్ తగిలినట్లే.
మా ఎమ్మెల్యేలను చేర్చుకుంది
అధికార తెరాస పార్టీ తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. మేం కూడా నలుగురిని మా వైపుకు రప్పించుకోగలమని చెప్పారు.
సంఖ్యా బలంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 16 మందితోనైనా తాము గెలుస్తామని చెప్పారు. తెరాస నైతికంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికలు అవసరం లేకుండా ఏకగ్రీవం కావాల్సిన దానిని తెరాస ఎన్నికలకు తెస్తోందన్నారు. కొత్త ఒరవడి తీసుకు రావొద్దన్నారు.