'అత్తగారి సొమ్ముల్లా.. దళితుల భూముల్ని లాక్కుంటావా చంద్రబాబు?'
కేబినెట్ సమావేశాల్లోను రైతు సమస్యలపై ప్రస్తావన లేదని, ఎంతసేపు రైతుల భూములను ఎలా లాక్కోవాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని జగన్ ఆరోపించారు.
గాజులపల్లి: కర్నూల్ జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రైతు భరోసా యాత్ర నేడు మహానంది మండలం గాజులపల్లికి చేరింది. గత వైఎస్ పాలనకు ఇప్పటి చంద్రబాబు పాలనకు పోలుస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని జగన్ దుయ్యబట్టారు.
వైఎస్ హయాంలో నిరుపేదలకు 31లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆయన అత్తగారి సొమ్ములా దళితుల భూములు లాక్కుంటున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు.
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటిదాకా 40మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్ గ్రేషియా మాత్రం కేవలం నలుగురికే ఇచ్చారని జగన్ అన్నారు.
బాబు సీఎం అయ్యాక అంతా కరువే
చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని, మూడేళ్ల నుంచి ఇక్కడ కరువు నెలకొని ఉందని అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు జగన్.
వైఎస్ ఉన్నప్పుడు అలా!.., ఇప్పుడిలా!..
వైఎస్ హయాంలో ప్రతీ రబీ పంటకు శ్రీశైలం నుంచి నీళ్లు అందాయని, గత ఆగస్టు 16నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో 844 అడుగుల నీటిమట్టం ఉన్నా.. రాయలసీమ రైతులకు మాత్రం నీళ్లు దక్కడం లేదని అన్నారు.
కేబినెట్ మీటింగ్స్ లోను అదే తీరు:
కేబినెట్ సమావేశాల్లోను రైతు సమస్యలపై ప్రస్తావన లేదని, ఎంతసేపు రైతుల భూములను ఎలా లాక్కోవాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని జగన్ ఆరోపించారు. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా దక్కించుకోని స్థితిలో రైతులు ఉన్నారని జగన్ అన్నారు.
ఆరోగ్యశ్రీని నీరుగార్చిన చంద్రబాబు
పేదల ఆరోగ్యం కోసం వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం చంద్రబాబు నీరుగార్చారని జగన్ విమర్శించారు. 108,ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదని అన్నారు.పేదల చదువు కోసం వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంటును కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారని అన్నారు.
అబద్దపు హామిలతో చంద్రబాబు మోసం:
అబద్దపు హామిలతో రైతులు, మహిళలు, విద్యార్థులు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరిని చంద్రబాబు మోసం చేశారని జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
వైఎస్ హయాంలోనే ప్రాజెక్టులు 90శాతం పూర్తయ్యాయని, కేవలం 5శాతం పనులు మాత్రమే చేయించి.. అంతా తామే చేశామని చంద్రబాబు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు.మనమంతా ఒక్కటై చంద్రబాబు లాంటి వ్యక్తిని బంగాళఖాతంలో కలిపేద్దామని కర్నూలు వాసులకు పిలుపునిచ్చారు.