రివర్స్: కరణం బలరాంను దూరం పెట్టిన చంద్రబాబు
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు తారుమారవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడిగా ఉంటూ వచ్చిన కరణం బలరాంను పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరం పెట్టినట్లు సంకేతాలు అందుతున్నాయి.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు తారుమారైన విషయం చంద్రబాబు పర్యటనలో స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు మిగతా నాయకులనే కాకుండా కొత్తగా పార్టీలో చేరినవారిని కూడా పేరుపేరునా పలకరించారు. అయితే కరణం బలరాంను పట్టించుకున్నట్లు కనిపించలేదు.
కరణం బలరాంను చంద్రబాబు పట్టించుకోకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలోని కీలక నాయకులంతా చంద్రబాబుకు స్వాగతం పలికారు. వారికి ప్రతినమస్కారం చేస్తూ చంద్రబాబు వేదిక మీదికి వచ్చారు. ఇటీవలే పార్టీలో చేరిన గొట్టిపాటి రవి, పోతుల రామారావులను భుజం తట్టి పలకరించారు. అదే వరుసలోనే ఉన్న కరణం బలరాంను మాత్రం పట్టించుకోలేదు.
జిల్లాలో కొత్తగా నలుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో జిల్లాలో ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ల మధ్య ఇటీవల మినిమహానాడులో జరిగిన వివాదంపై చంద్రబాబు ఇంతకు ముందు అసంతృప్తి వ్యక్తం చేసారు. అప్పటి నుంచి కరణం బలరాంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.