విభజన విషయంలో ఒకటి చెప్పా,ఘనత కాంగ్దే: బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో తానొకటి చెప్పానని, ఆ దిశలో కాంగ్రెసు పార్టీ ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో ఆయన పలువురు జాతీయ పార్టీ నాయకులను కలిశారు. అనంతరం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన విషయంలో తాను ఇరు ప్రాంతాలను ఒప్పించాలని చెప్పాలని, తెలంగాణ కావాలంటే సీమాంధ్రుల అంగీకారం, సమైక్యాంధ్ర కావాలంటే తెలంగాణ వారి అంగీకారం కావాలని తాను చెప్పానని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పార్టీ నీచంగా రాష్ట్రాన్ని విభజిస్తోందని మండిపడ్డారు. సమస్యకు పరిష్కారం చూపాలి తప్ప రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దన్నారు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రాల విభజనలు కమిటీలు, కమిషన్ల ద్వారానే జరిగాయని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీలోనే స్పష్టత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల రోజురోజుకు వైషమ్యాలు పెరుగుతున్నాయన్నారు. ఒక వ్యక్తి ప్రయోజనం కోసం, ఓట్లు, సీట్ల కోసం ఇలాంటి నీచ రాజకీయాలు చేయవద్దన్నారు.
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో మొదట శాంతిని నెలకొల్పాలన్నారు. తెలుగు ప్రజలను చీల్చిన ఘనత కాంగ్రెసు పార్టీదే అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో విచిత్రాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీని గెలిపించేందుకు 24 మంది ఎమ్మెల్యేలున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీలో నిలవదని, అదే తెలంగాణ రాష్ట్ర సమితి నిలుస్తుందన్నారు. ఇవన్నీ చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
ఈ పదేళ్లలో తెలంగాణ సమస్యను కాంగ్రెసు పార్టీ పరిష్కరించలేదన్నారు. ఇరు వైపుల కూర్చుండబెట్టి సమస్యలు పరిష్కరిస్తే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. వార్ రూంను పీస్ రూంగా మార్చాలని కాంగ్రెసు పార్టీకి హితవు పలికారు. సమైక్యాంధ్ర పేరుతో సీమాంధ్ర కాంగ్రెసు ప్రజలను మోసం చేస్తోందని, హైదరాబాదును కామన్ క్యాపిటల్ అనడం విడ్డూరమన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా అలా ఉందా అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం ఉంది సమస్యలు తీర్చేందుకు తప్ప సృష్టించేందుకు కాదన్నారు.
అంతకుముందు ముంబైలో మాట్లాడుతూ.. విభజన ప్రక్రియలో కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇరు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రజల సమ్మతితోనే తాము ముందుకు వెళతామని, ప్రజల పురోగతి కొరకు తాము పని చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల సహకారం లేనిదే సమాఖ్య ఉండదని, ఇది జాతీయ సమగ్రతకే ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. భారతదేశం పరిపక్వత చెందిన అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని ఆయన కొనియాడారు. అన్ని రాష్ట్రాల నమ్మకాలను కేంద్రం పొందాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరిగే పరిణామాలన్నీ హింసాత్మకంగా తయారవుతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన తెలిపారు. మొదటి నుండి రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం చాలా స్పష్టంగా ఉందని, తెలుగు ప్రజల అభివృద్ధి కోసమే టిడిపి పుట్టిందన్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం టిడిపి ఉద్దేశమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఇరు ప్రాంతాలను సంతృప్తిపర్చాల్సిన అవసరం ఉందన్నారు. సీమాంధ్ర ప్రజల సమ్మతితోనే కేంద్రం తెలంగాణ ప్రకటించాలని చంద్రబాబు సూచించారు. వైయస్ జగన్, తెరాసలతో కాంగ్రెస్ కుమ్మక్కయిందని, అవినీతి ఆరోపణలతో జగన్ జైలుకు వెళ్లాడన్నారు.