చంద్రబాబుకు 'మూడు ముఖ్యమైన బాధ్యతలు'.. అవేంటంటే..!
విజయవాడ : కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం నాడు పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయడు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తనకు మూడు ముఖ్యమైన బాధ్యతలున్నాయని గుర్తు చేశారు.
అందులో ఒకటి ప్రజల సంక్షేమం కోసమై శ్రమించడం, రెండవది టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఆదుకోవడం, మూడవది తన కుటుంబం అని వివరించారు. భగవంతుడు తనకు కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపేందుకు అంతగా అవకాశమివ్వలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ బాధ్యతల్లో భాగంగానే హెరిటేజ్ వ్యవహారాలను భావిస్తామని, అందుకే ఆ కంపెనీ నీతి, నిజాయితీలతో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. శెభాష్ తెలుగుదేశం అనేలా ప్రతీ ఒక్కరి నుంచి మన్ననలు అందుకునేలా నేతలు పనిచేయాలని, ప్రలోభాలకు లోనుకాకూడదని నేతలకు హితవు పలికారు. కాంగ్రెస్ వైసీపీలు రెండు కుమ్మక్కయ్యాయని ఆరోపించిన చంద్రబాబు..కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ మరియు పార్టీ సంక్షేమ కార్యక్రమాల గురించి చెబతూ.. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలకు రూ.2లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించినట్టుగా తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పేదపిల్లలను చదివిస్తున్నట్టుగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కార్యకర్తలు జనంలోకి తీసుకెళ్లాలని ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పని అంటూ మొదలుపెట్టిన తర్వాత సమర్థవంతంగా పనిచేయాలని, సక్రమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు.