అర్థాంతరంగా ఆగిన చంద్రబాబు ఏరియల్ సర్వే: నెల్లూరు జిల్లాలో ఇంకా వర్షాలు
చిత్తూరు/ విశాఖపట్నం: వరద తాకిడి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే అర్థాంతరంగా ముగిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించేందుకై చంద్రబాబు నాయుడు బుధవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరారు.
అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఏరియల్ సర్వే ద్వారా పర్యటించారు. మిగిలిన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై అదే హెలికాఫ్టర్లో ఉన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం చంద్రబాబు రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి రోడ్డుమార్గం ద్వారా చిత్తూరుకు బయలుదేరారు. మంగళావరం హత్యకు గురైన మేయర్ అనురాధ దంపతులకు నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడకు ఆయన చేరుకోనున్నట్లు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుంటే, కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ బంగాళాఖాతంలో బలహీనపడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశముందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు-17, నెల్లూరు-11, రాపూర్-9, కోడూరు-8, అమలాపురం, వెంకటగిరిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నెల్లూరు జిల్లా మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల అధికారులతో చంద్రబాబు ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 24 గంటల పాటు నెల్లూరు జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కడప, చిత్తూరు జిల్లాల్లో బుధవారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వాగులు, వంకల్లో వరద ప్రవాహం తగ్గింది. కడప జిల్లా నుంచి తిరుపతి వైపు అన్ని బస్సు సర్వీసులను నడుపుతున్నారు. రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నెల్లూరు వైపు వెళ్లాల్సిన రైళ్లను కడప, రేణిగుంట వైపు మళ్లించారు.
బుధవారం తెల్లవారు జాము నుంచి కూడా నెల్లూరు జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తోంది. ఇప్పటికే పలు గ్రామాలు జలమయం అయ్యాయి. పునరావాస కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. కైవల్యానది, స్వర్ణముఖి, కాళింది నదులకు వరద ఉధృతి తగ్గలేదు.