అందరూ చూస్తున్నారు, జాగ్రత్త: హోదాపై బాబు, పరీక్ష పాస్ అయితే..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం టిడిపి పార్లమెంటు సభ్యులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక హోదా, సభలో వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు.
ప్రత్యేక హోదా పైన పార్లమెంటులో జరుగుతున్న చర్చను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేయాలనేది మన ఉద్దేశ్యం కాదని, ఏపీకి న్యాయం చేయాలనేదే మన భావన అన్నారు.
మొక్కలు నాటిన చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా 'వనం-మనం' కార్యక్రమం కొనసాగుతోంది. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో ఏర్పాటు చేసిన వనం - మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఔషధ, రావి, వేప మొక్కలు నాటారు. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
చెట్లు నాటిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ప్రకృతిని మనం ఆరాధించాలని, ప్రకృతిని మనం ప్రేమించాలని మన పెద్దవాళ్లు చెప్పారన్నారు. నదులు, చెట్లు తదితర వాటిల్లో దేవుడు ఉంటాడని పెద్దలు చెప్పారన్నారు. అందుకే మనం వాటికి పూజ చేస్తామని, మనది గొప్ప సంప్రదాయమన్నారు.
కృష్ణా - గోదావరి నదులను టిడిపి ప్రభుత్వం అనుసంధానం చేసిందన్నారు. అందరు ప్రతి సమయంలో చెట్టు పెట్టాలన్నారు. పరీక్షల్లో పాసైన చెట్టు పెట్టాలని, ఎవరైనా పుట్టిన చెట్టు పెట్టాలని, జీవితంలో ఏం జరిగినా చెట్టు పెట్టాలన్నారు. చెట్లకు ప్రాణం ఉందన్నారు.
ఇక నుంచి మనం ఇచ్చే బహుమతులను కూడా చెట్ల రూపంలో ఇవ్వాలన్నారు. అడవుల విస్తీర్ణాన్ని 26 శాతం నుంచి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రతి మంచి పనికి గుర్తుగా ఓ మొక్క నాటాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణ కోసం ట్రీ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కలాం వేషంలో శివప్రసాద్
టిడిపి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శుక్రవారం నాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వేషం వేశారు. గతంలో ఆయన పలు వేషధారణల్లో కనిపించారు. తాజాగా, చిత్తూరులో 'ఒకే రోజు కోటి మొక్కలు' కార్యక్రమంలో భాగంగా ఉదయం చిత్తూరులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన కలాం వేషంలో దర్శనమిచ్చారు. కలాం వేషధారణలో కార్యక్రమానికి వచ్చిన శివప్రసాద్ అక్కడి స్థానిక నేతలతో కలిసి మొక్కలను నాటారు.