సాయంత్రమే: 'స్టెల్లా' భానుప్రీతి మృతిపై కమిటీ, కేశవ రెడ్డి ఆస్తుల జఫ్తుకు ఛాన్స్
విజయవాడ/గుంటూరు: స్టెల్లా కళాశాల ఘటన పైన మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం నాడు విచారణకు ఆదేశించారు. కళాశాలను సందర్శించి సాయంత్రం లోగా విద్యార్థిని భానుప్రీతి మృతి పైన నివేదిక ఇవ్వాలని గంటా ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం ఇందిరమ్మ కాలనీకి చెందిన దొమన్మేటి భానుప్రీతి విజయవాడలోని స్టెల్లా కళాశాలలో చదువుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి.
దీంతో, మంత్రి గంటా శ్రీనివాస రావుస్పందించారు. ఆయన ఈ ఆత్మహత్య పైన కమిటీని వేసి, విచారణకు ఆదేశించారు. ఇంటర్ విద్యా కమిషనర్ సత్యనారాయణను విచారణాధికారిగా నియమించారు. అంతకుముందు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, పీతల సుజాతలు భానుప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కేశవ రెడ్డి సంస్థల ఆస్తుల జఫ్తుకు అవకాశం
కేశవ రెడ్డి విద్యా సంస్థల ఆస్తులను సిఐడి దర్యాఫ్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేశవ రెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవ రెడ్డి వందల కోట్ల రూపాయల డిపాజిట్ల స్కాం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
కేశవ రెడ్డిని సిఐడి పోలీసులు ప్రశ్నించారు. నాలుగు రోజుల పాటు అతనిని కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం కేశవ రెడ్డిని న్యాయస్థానంలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా కేశవ రెడ్డి ఆస్తులను సిఐడి జఫ్తుకు చేసుకోవచ్చునని తెలుస్తోంది.