చరిత్రలో ఇదే తొలిసారేమో!: బడ్జెట్ సెషన్స్ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు 'బంపర్ ఆఫర్'
సభ్యుల పనితీరును బేరీజు వేసి వారికి బహుమతులు ప్రకటించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
విజయవాడ: పార్టీ ఎమ్మెల్యేలను తనకు విధేయులుగా మలుచుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా!. సర్వేల పేరుతో వారిని కట్టడి చేయడం.. ర్యాంకులు ఇచ్చి మరీ వారి పనితీరును బేరీజు చేయడం చంద్రబాబుకు మాత్రమే చెల్లుతాయి.
తాజాగా ఏపీ సీఎం మదిలో మరో కొత్త ఆలోచన మెదిలింది. మార్చి 13న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండటంతో.. ప్రతిపక్షం నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టడానికి ఆయన ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ఎమ్మెల్యేలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి ఆయన సిద్దమవుతున్నారు.
అంటే, సభలో ఎవరైతే ప్రతిపక్షం దూకుడుకు సమర్థవంతంగా కళ్లెం వేస్తారో.. ఎవరైతే తమ మాట తీరుతో అధికార పార్టీ నిర్ణయాలను మెప్పించగలుగుతారో.. సభ ముగిసిన తర్వాత మీడియా ముందు తమ నేర్పును ప్రదర్శించగలుగుతారో.. అలాంటి ఎమ్మెల్యేలందరికి బహుమతులు దక్కుతాయన్నమాట.
సభ్యుల పనితీరును బేరీజు వేసి వారికి బహుమతులు ప్రకటించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ చరిత్రలోనే బహుశా ఇలాంటి కార్యక్రమం తొలిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఈ మేరకు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి బడ్జెట్ సమావేశాలు ముగిసేదాక ప్రతీ రోజు ఆరు బహుమతులు అందజేయాలని సీఎం నిర్ణయించారు. ఎమ్మెల్యేలకు బహుమతులు ఇవ్వడం వలన వారి పనితీరు మెరుగుపడుతుందనేది సీఎం అభిప్రాయంగా తెలుస్తోంది.
మొత్తం మీద బహుమతుల కోసమైనా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పోటా పోటీగా తమ నేర్పును ప్రదర్శించడానికి ఇకనుంచి సిద్దమవుతారన్నమాట!.