సుప్రీంకోర్టుకైనా వెళ్తాం: కోడి పందేలపై శివరామరాజు
పశ్చిమగోదావరి: కోడి పందేలపై తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే శివరామరాజు పంతం పట్టినట్లు కనిపిస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాము కోడి పందేలను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. సంక్రాంతి పండగ సమయంలో కోడి పందేలు నిర్వహించడం తమ సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు.
ఆయన బుధవారం మాట్లాడుతూ.. అవసరమైతే కోడి పందేల ఆటపై సుప్రీం కోర్టుకు వెళ్తామని అన్నారు. తమ సంప్రదాయాన్ని అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించోద్దని అన్నారు. కాగా, కోడి పందేలు ఆడటంపై కోర్టు కూడా ఇటీవల తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ వ్యవహారం గోదావరి జిల్లాల్లో అధికార్లు, అధికార తెలుగుదేశం నేతల మధ్య చిచ్చురేపుతోంది. మంగళవారం ఎంపిలు, ఎమ్మెల్యేలు సైతం జడ్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి, ఆందోళనకు దిగారు. కోడిపందాలు ఈ ప్రాంతంలో వందల ఏళ్ల నుండి సంప్రదాయంగా వస్తున్నాయని, దాన్ని కాపాడుకుంటామని, కావాలనుకుంటే బెట్టింగ్ నిరోధించుకోవచ్చునని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు తెగేసి చెప్పడం విశేషం.
కాగా, ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో భారీగా కోడిపందాలు సాగిపోతున్నాయి. ద్వారకాతిరుమల మండలం వేంపాడులో గత కొద్ది రోజులుగా ఒక ఆయిల్పామ్ తోటలో ఫ్లడ్లైట్ల వెలుగులో రాత్రిపూట భారీ కోడిపందాలకు తెరలేపారు. గత శనివారం అర్ధరాత్రి పోలీసులు ఈ పందాలపై దాడిచేసి 17మందిని అరెస్టు చేశారు. వీరినుంచి రూ.4.16 లక్షల నగదు, పలు కార్లు, మోటారు సైకిళ్లు, కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారికి బెయిలు ఇవ్వడానికి ద్వారకాతిరుమల పోలీసు స్టేషన్కు వెళ్లిన రామన్నగూడెం సొసైటీ అధ్యక్షులు సుంకవల్లి బ్రహ్మయ్యను పోలీసులు అరెస్టు చేసి, 420 కేసు నమోదు చేశారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే బ్రహ్మయ్య వంటి పెద్దమనిషిపై 420 కేసు ఎలా పెడతారంటూ ద్వారకాతిరుమల, పరిసర మండలాలకు చెందిన తెలుగుతమ్ముళ్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ మంగళవారం ఏలూరులోని జడ్పీ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఏలూరు ఎంపి మాగంటి బాబు, రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్, నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బండారు మాధవనాయుడు, వేటుకూరి శివరామరాజు ఆందోళనకారుల వద్దకు చేరుకుని వారికి మద్దతుగా బైఠాయించారు. సంప్రదాయంగా వచ్చే కోడిపందాలకు జిల్లా ఎస్పీ రఘురామ్రెడ్డి అడ్డుపడుతున్నారని, పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఎంపిలు మాగంటి బాబు, మురళీమోహన్ మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి కోడిపందాలు కూడా ఒక సంప్రదాయమేనని వారు స్పష్టంచేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లామని వారు చెప్పారు. అనంతరం ఎంపిలు సమావేశమందిరంలోకి చేరుకుని అక్కడ ఉన్న జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ దృష్టికి వేంపాడు ఘటనను తీసుకువెళ్లి పోలీసుల వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.