వేడుకుంటున్నా, నన్ను వదిలేయండి: ఉబేర్ డ్రైవర్ తండ్రి
మైన్పురి: ఢిల్లీ మహిళా ఎగ్జిక్యూటివ్పై అత్యాచారం కేసులో అరెస్టయిన ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ యాదవ్ తండ్రి రామనాథ్ యాదవ్ శుక్రవారంనాడు ఇంటి బయటకు వచ్చి తన ఇంటి వద్దకు వచ్చిన గ్రామస్థులను, మీడియా ప్రతినిధులను వేడుకున్నాడు. మైన్పురి రామ్నగర్ ఉంటున్న 76 ఏళ్ల రామనాథ్, 70 ఏళ్ల ఆయన భార్య గంగాశ్రీ ఇంటి బయటకు వచ్చి - తమను వదిలేయాలని వేడుకున్నారు. వారి ఇంటి నిర్మాణం సగంలో ఉంది.
తాను నాలుగు రోజులుగా తిండి తినలేదని, ఒత్తిడితో చచ్చి పోత్తున్నామని, దాన్ని భరించలేకున్నామని, తాను బలహీనంగా ఉన్నానని, అలసిపోయానని రామనాథ్ అంటూ తాను మాట్లాడదలుచుకోలేదని, తనను ఒంటరిగా వదిలేయాలని వేడుకుంటున్నానని చేతులు జోడించి అన్నాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇంతకు ముందు తమ ఇంటికి వచ్చేవారిని కూర్చోమని చెబుతూ శివకుమార్ యాదవ్ గురించి అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తుండేవారు. తాగడానికి మంచినీళ్లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఇంటి తలుపులు కూడా తీయడం లేదు. పగటి పూట ఆ దంపతులు బయటకు కూడా రావడం లేదు.
స్థానిక ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పిన రామనాథ్ను మాస్టార్జీ అని పిలుస్తారు. ఇప్పుడు ఆయనకు మచ్చ అంటింది. రేపిస్టు, గుండా తండ్రిగా ఆయనకు కొత్త గుర్తింపు వచ్చింది. చాలా కష్టంగా ఉందని, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నామని, మూడో వాడు తమను తాము చంపుకునే పరిస్థితి కల్పించాడని ఆయన అన్నారు.
రామనాథ్ దంపతులకు నలుగురు కుమారులు. పెద్ద కొడుకు వ్యాధితో చనిపోయాడు. రెండో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడో కొడుకు శివకుమార్ యాదవ్ అత్యాచారం కేసులో జైలులో ఉన్నాడు. నాలుగో కుమారుడు లవ్కుశ్ బుద్ధిమాంద్యం కారణంగా వారితోనే ఉంటున్నాడు.