నేనేవరికీ భయపడను, అందుకే ఏమిచేయలేదు: బాబు
విజయనగరం/గుంటూరు: తనపై ఎలాంటి అవినీతి కేసులు లేవని, తానెవరికీ భయపడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన ప్రజా గర్జనలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై ఎలాంటి అవినీతి కేసులు లేవని, నిప్పులా బ్రతికానని, నిజాయితీగా ఉండబట్టే ఏమీ చేయలేకపోయారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తనపై అవినీతి కేసులు పెట్టిందని, 35 సార్లు కోర్టుకు వెళ్ళిందని, 25 సార్లు విచారణ జరిపిందని అన్నారు. తాను నిజాయితీగా ఉండబట్టే తననేమీ చేయలేకపోయారని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. నిజాయితీపరుడికే ఓటేసే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఆదివాసులను ఆదుకునే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు.
నీతిమాలిన పార్టీలని, నీతిమాలిన వ్యక్తులని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రజల్లో చైతన్యం రావాలని, మన సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్ కోసం మనం పోరాడాలని ఆయన అన్నారు. ప్రతి జిల్లాకో వృద్ధాశ్రమం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
టిడిపి బుల్లెట్లా దూసుకువెళ్తోందని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బొబ్బిలిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎస్సి, ఎస్టి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
పొత్తుపై పునరాలోచించాలి: రాఘవులు
గుంటూరు: భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంలో టిడిపి పునరాలోచించుకోవడం మంచిదని సిసిఎం నాయకుడు బివి రాఘవులు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బిజెపి వంటి మతతత్వ పార్టీలు టిడిపి లాంటి ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చట్టసభల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.