అమరావతిలో అంతర్జాతీయ విద్యుత్తు వ్యవస్థ...రూ.16,383 కోట్లతో ప్రతిపాదనలు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు.
అమరావతిలో రూ.16,383 కోట్లతో అంతర్జాతీయ స్థాయి విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లు ఎపి విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కడా ఓవర్హెడ్ లైన్లు కనిపించకుండా భూగర్భంలోనే విద్యుత్ లైన్లు వేయనున్నట్లు తెలిపారు. ప్రతిపాదనలు రూపొందించే క్రమంలో విదేశీ విద్యుత్ రంగ నిపుణులతో వర్కుషాపులు నిర్వహించామన్నారు.

అధికారులు రూపొందించిన విద్యుత్ వ్యవస్థలో రూ. 1,220 కోట్లతో 440 కెవి సామర్ధ్యం కలిగిన 4 సబ్స్టేషన్లు, రూ.2,616 కోట్లతో 222 కెవి సామర్ధ్యం కలిగిన 24 సబ్స్టేషన్లు, రూ.1,276 కోట్లతో 33 కెవి సామర్ద్యం కలిగిన 220 సబ్స్టేషన్లు, సరఫరాకు సంబంధించి 220 కెవి విద్యుత్ సామర్ధ్యం కలిగిన వెయ్యి కిలోమీటర్ల మేర కేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. రూ.2,072 కోట్లతో 33 కెవి సామర్ధ్యం కలిగిన 5,600 కిలోమీటర్ల కేబుళ్లు, సివిల్ వర్క్సు, ఆర్ సి సి ట్రెంచ్లకు రూ.3,500 కోట్లు, ఇహెచ్టి లైన్లకు రూ.1,060 కోట్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కుకు రూ.850 కోట్లు, వీధి దీపాలు, ఇతర పనులకు రూ.1,060 కోట్లు, కంటింజెన్స్, అడ్మినిస్ట్రేటివ్ వ్యయం రూ.927 కోట్లతో కలిపి మొత్తం రూ.16,383 కోట్లు ఖర్చవుతుందని ఈ ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications