మేయర్ అనురాధ దంపతుల హత్య: చింటూ లొంగిపోతాడా?
హైదరాబాద్: చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ కోర్టులో లొంగిపోవడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థకు అతని పేరిట ఓ లేఖ వచ్చింది.
మేయర్ దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని నిందితుడు చింటూ ఆ లేఖలో స్పష్టం చేశాడు. ఆయన పేరుతో తమకు ఓ లేఖ వచ్చినట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలిపింది. పోలీసులు తనను టార్గెట్ చేశారని, కటారి దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని లేఖలో చెప్పాడు.
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, అవకాశమిస్తే కోర్టులో లొంగిపోయి వాస్తవాలు చెబుతానని అందులో స్పష్టం చేశాడు. మీడియాలో కథనాలు, పోలీసుల ఇంటర్వ్యూలు చూస్తే తనకు నాకు ప్రాణహాని ఉందని అర్థమైందని అన్నారు.
అయితే లేఖతో చింటూకు సంబంధం ఉందా లేదన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అనురాధ, మోహన్ దంపతులు ఈ నెల 4వ తేదీన చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మంది నిందితులను గుర్తించారు. వీరిలో కొంత మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.