జూ.ఎన్టీఆర్ అనుకుంటే..: లోకేష్ కోసం బాబు కుప్పం వీడుతారా?
విజయవాడ: 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే ఉత్కంఠ చాలామందిలో ఉంది. వచ్చే ఎన్నికలకు సిద్ధమన్న లోకేష్ కుప్పం లేదా చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
తాను 2019కి ముందు పోటీ చేసేది లేదని, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని నారా లోకేష్ ఇది వరకే చెప్పారు. అప్పుడు గెలిస్తే లోకేష్కు మరింత కీలక బాధ్యతలు అప్పగించవచ్చునని చెబుతున్నారు. ఈలోగా కూడా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
నారా లోకేష్ 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. చంద్రబాబు 1989 నుంచి ఆరుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కొడుకు కోసం కుప్పంను వదిలేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. లేదంటే చంద్రగిరి నుంచి కూడా పోటీ చేయవచ్చునని చెబుతున్నారు. 1978లో చంద్రబాబు చంద్రగిరి నుంచి తొలిసారి గెలిచారు.
రాజ్యసభ ఎన్నికలకు ముందు లోకేష్ అంశం బాగా చర్చకు వచ్చింది. ఆయనను రాజ్యసభకు పంపిస్తారని, కేంద్రమంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, తనకు రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే ఇష్టమని లోకేష్ ఆ సమయంలో ప్రకటించారు.
లోకేష్ కోసమే...
చంద్రబాబు 1995 నుంచి టిడిపి అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఇటీవల ఓ సమయంలో మరో సీనియర్ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని సూచించారని తెలుస్తోంది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.
ఈ నేపథ్యంలో కొత్త భవనాలు, కొత్త పాలన, ఆర్థిక కష్టాల నేపథ్యంలో పార్టీ బాధ్యతలు మరో సీనియర్ నేతకు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని తెలుస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం లోకేష్ను తన వారసుడిగా చేసుకునే ఉద్దేశ్యంతో ఉన్నందున పార్టీ అధినేతగా మరో సీనియర్కు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా లేరనే వార్తలు వస్తున్నాయి.
ఇదీ లోకేష్!
నారా లోకేష్ బాల్యం హైదరాబాదులో గడిచింది. ఆయన హైదరాబాదులో స్కూల్ చదువు చదివారు. అమెరికాలోని కార్నెజీ మెలన్ వర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ చేశారు. స్టాన్ఫర్డ్లో ఎంబీయే చేశారు. ఆ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ పైన దృష్టి సారించాడు.
వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి..
లోకేష్ను వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి తెచ్చారనే వాదనలు ఉన్నాయి. తొలుత స్టూడియో ఎన్ అనే ఛానల్ లోకేష్ చేతిలో ఉండేది. ఈ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ మామకు చెందినది. జూనియర్ ఎన్టీఆర్ - లోకేష్ మధ్య రాజకీయ వారసత్వ పోరు నడిచింది కూడా.
2008 నుంచి లోకేష్ పార్టీ కోసం పని చేస్తూ.. మెల్లిగా ఇప్పుడు జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. చంద్రబాబు తర్వాత బాలకృష్ణ లేదా జూ ఎన్టీఆర్ చేతికి పార్టీ వెళ్తుందనే వాదనలు వినిపించాయి. హరికృష్ణ కూడా తన తనయుడు జూనియర్ కోసం ప్రయత్నాలు చేశారు. 2009లో పార్టీ కోసం పని చేసిన జూ ఎన్టీఆర్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కానీ లోకేష్ తెరపైకి వచ్చారు.