పిపిఎలపై చంద్రబాబుకు షాక్: తెలంగాణకు ఊరట
హైదరాబాద్: విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుని తెలంగాణకు విద్యుత్తులో వాటాను నిరోధించాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎపి విద్యుత్తు నియంత్రణ మండలి (ఎపిఈఆర్సి) షాక్ ఇచ్చింది. విద్యుత్తు కష్టాలతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణకు ఊరట లభించింది.ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఒక వివాదానికి తెరదించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రతిపాదనలను ఏపీ జెన్కో ఉపసంహరించుకోవడం చెల్లదని తేల్చి చెప్పింది.
మొత్తం 13 పీపీఏల విద్యుత్తులో తెలంగాణకూ యథాతథంగా వాటా అందుతుందని తేల్చింది. ఏపీజెన్కో ఇచ్చిన పిపిఎల రద్దు నోటీసు, దానిపై తెలంగాణ ఎస్పీడీసీఎల్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఏపీఈఆర్సీ సోమవారం రాత్రి పొద్దుపోయాక ఆకస్మికంగా ఈ తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జెన్కోల ప్రాజెక్టు పిపిఎలు చెల్లుబాటు అవుతాయని, ఈ పీపీఏలకు తాత్కాలికంగా అనుమతి ఇవ్వకున్నప్పటికీ వాటికి సంబంధించిన టారిఫ్ను ఇప్పటికే ఖరారు చేసి, వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేసున్నారని, అందువల్ల అవి అమలులో ఉన్నట్లేనని తేల్చింది.
ఏపీ జెన్కో ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించిన ఆ 13 పీపీఏలు చెల్లుబాటు అవుతాయని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. ఏపీ విద్యుత్తు నియంత్రణ చట్టంలోని సెక్షన్-21(5)ను అడ్డుపెట్టుకుని ఏపీ జెన్కో ఈ పీపీఏలను రద్దు చేయడం చెల్లదని, కేంద్ర విద్యుత్తు చట్టం 86(1)(ఎ)(బి) ప్రకారం అవి చెల్లుబాటు అవుతాయని తేల్చి చెప్పింది. ఈ 13 పీపీఏలకు సంబంధించిన టారిఫ్ను 12 ఏళ్లుగా అమలు చేస్తున్నారని చెప్పింది.
కానీ ఇప్పుడు కేవలం ఈఆర్సీ ఆమోదించలేదన్న సాకుతో వాటిని ఉపసంహరించుకోవడం సరికాదని, ఏపీ జెన్కో చెప్పినట్లుగా ఆ 13 ముసాయిదా పీపీఏల్లో ఇరు పక్షాల మధ్య వివాదం తలెత్తితే ముందుగా నోటీసు ఇవ్వాలని, ఆ తర్వాత ఇరువురూ కూర్చుని, చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఈఆర్సీని ఆశ్రయించాలని, ఈ నైతిక విధానాలను ఏపీ జెన్కో అనుసరించలేదని, ఒకసారి టారిఫ్ అమల్లోకి వచ్చిన తర్వాత సంబంధిత పీపీఏలు కూడా అమలులోకి వచ్చినట్లేనని, వాటిని ముసాయిదా పీపీఏలు అనలేమని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొన్ని ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లాయని, తెలంగాణలో విద్యుదుత్పత్తి చేస్తున్న ప్రాజెక్టుల పీపీఏలను ఎలాంటి యాజమాన్య హక్కులూ, అధికారం లేని ఏపీ జెన్కో ఎలా ఉపసంహరించుకుంటుందని ఈఆర్సీ నిలదీసింది. పీపీఏల వివాదంపై కేంద్రం నియమించిన సీఈఏ చైర్పర్సన్ నీరజా మాథుర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నామని ఏపీఈఆర్సీ గతంలో పేర్కొంది. సోమవారం ఉన్నట్టుండి దీనిపై స్వతంత్రంగా తీర్పును ఇచ్చేసింది. సీఈఏ కమిటీ నివేదిక ఇంకా జాప్యమయ్యే సూచనలు కన్పిస్తున్నందున తాము ప్రస్తుత తీర్పును ఇస్తున్నామని ఈఆర్సీ చెప్పింది.