నాకు పవర్ లేకుండా చేశారు: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య
Recommended Video
విజయవాడ: పవర్ సెక్టార్లో తాను పలు సంస్కరణలు తెచ్చానని, అయితే 2004లో మీరు తనకు పవర్ లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి అన్నారు. అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ లేబొరేటరీకి గురువారం శంకుస్థాపన చేశారు.
పోలీసులు, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో రౌడీలకు, దొంగలకు స్థానం లేదని, దొంగల వేలిముద్రలు సేకరించడం వల్ల తక్కువ సమయంలో కేసులు చేధిస్తున్నామని చెప్పారు.
ఇక నేరాలు జరగడానికి వీల్లేదు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఏ విధమైన నేరాలు జరగడానికి అవకాశం లేదని, గట్టిగా శిక్ష వేస్తేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు అన్నారు. కోర్టులో ఏదో ఒకచోట తప్పించుకుంటామనే భావనతోనే నేరాలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు.
ఆరు నెలల్లో అమరావతికి రూపు..
ఆరునెలల్లో అమరావతికి ఒక రూపం వస్తుందని, పీపీపీ విధానంలో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు అన్నారు. పోలీసు అధికారులందరికి స్కిల్ ట్రైనింగ్ తప్పనిసరి అని అన్నారు. ఎన్ని కేసులు బుక్ చేశామనేది కాదు, ఎన్ని ఛేదించామనేదే ముఖ్యమనేది ముఖ్యమని అన్నారు.
టెక్నాలజీలో పోలీసులది వెనకడుగే
కేసుల పరిష్కారంలో కాస్త వెనుకబడి ఉన్నామని, టెక్నాలజీ వాడకంలో పోలీసులు కూడా వెనుకబడి ఉన్నారని చంద్రబాబు అన్నారు టెక్నాలజీ ద్వారా తప్పు చేసేవాడిని ముందుగానే గుర్తించవచ్చునని చెప్పారు. నేరాలు రుజువయ్యే రేటు పెరగాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు నియంత్రించాలని అన్నారు.
బెస్ట్ ల్యాబ్గా తయారు కావాలి
నేరాలకు చెక్ పెట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలోనే బెస్ట్ ల్యాబ్గా తయారుకావాలని ఆయన అన్నారు. ఏపీ ఫోరెన్సిక్ భవనానికి గురువారం గుంటూరు జిల్లా, తుళ్లూరులో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అవసరమైన ఫోరెన్సిక్ ల్యాబ్ను ప్రభుత్వంలో పెట్టుకుందామని, ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్కు అవకాశం కల్పిస్తామని అన్నారు.
జనవరి 2 నుంచి జన్మభూమి.
జనవరి 2వతేదీ నుంచి జరిగే జన్మభూమి పది రోజులు పండుగ వాతావరణం నెలకొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన ఆయా శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్మభూమిలో ఒక్కో రోజు ఒక్కో క్రీడా పోటీని గ్రామస్థాయిలో నిర్వహించాలని, గ్రామీణ క్రీడలను ప్రధానంగా ప్రోత్సహించాలని ఆయన అన్నారు.