ముద్రగడకు బాసట: చంద్రబాబును నిలదీసిన పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి మధ్య విభేదాలు అందరికి తెలిసిన విషయమే.
హైదరాబాద్ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి మధ్య విభేదాలు అందరికి తెలిసిన విషయమే. ఎన్టీఆర్ కూతురుగా దగ్గుబాటి పురందేశ్వరి పారదర్శకంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారని ప్రతీతి.
తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాలైనా దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను అనునిత్యం వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఆ విషయాన్ని బహిరంగంగా కుండబద్ధలు కొట్టినట్లు బయటపెట్టేస్తారు.
2014 ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రస్తుతం ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పించారు.
చంద్రబాబు ఇలా మంజునాథ కమిషన్ ఏర్పాటు
కానీ అధికారం చేజిక్కిన తర్వాత ఆ ఊసే మరిచిపోయారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ మంత్రి - సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళనతో ఏడాదిన్నర తర్వాత మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశారే తప్ప.. ఆచరణలో మరో చేసింది శూన్యం. ఇచ్చిన హామీల అమలు కోసం పాదయాత్ర చేస్తానంటే పోలీసుల సహకారంతోనే ‘సొంతింట్లో'నే నిర్బంధించారు చంద్రబాబు నాయుడు.
Recommended Video
ముద్రగడ పద్మనాభం ఆందోళనపై ఇలా పురందేశ్వరి
భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తన వాణి వినిపించుకునే స్వేచ్ఛ, హక్కు ఉన్నాయి. కానీ ముద్రగడ తన సామాజిక వర్గానికి కీలకమైన డిమాండ్ అమలు చేయమని డిమాండ్ చేయడమే అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారింది. సభలు, పాదయాత్రలకు అనుమతి నిరాకరించడం సబబు కాదని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవడం సరి కాదని ఆమె తప్పుబట్టారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదన్నారు. రిజర్వేషన్లు అనేవి ఒక పద్ధతి ప్రకారం ఇస్తారని, రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకెళితే కేంద్రం కూడా దృష్టి సారిస్తుందని పురందేశ్వరి తెలిపారు.
చంద్రబాబుకు ఇలా తప్పవ్ కష్టాలు?
అసలు గమ్మత్తేమిటంటే వారం పాటు సొంతింటిలో నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ ముద్రగడ పద్మనాభం న్యాయస్థానం మెట్లెక్కితే చంద్రబాబు ప్రభుత్వానికి కష్టాలు తప్పవు. దిగ్బంధం ఆదేశాలు జారీ చేసిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు న్యాయస్థానం చివాట్లు తప్పవన్న అభిప్రాయం వినిపిస్తున్నది. అయితే ఎప్పటికైనా పాదయాత్ర చేస్తానని ప్రకటించడం ద్వారా రాజకీయంగా కాపులను ప్రేరేపించాలనే ముద్రగడ పద్మనాభం యోచనగా ఉన్నదని తెలుస్తున్నది.
సిద్ధాంత పరంగా నిర్ణయాలు తీసుకోవాలని వ్యాఖ్య
మిత్రపక్షంతో కలిసిపనిచేస్తున్నా సొంతంగా బలపడాలని అనుకుంటున్నామని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా చెప్పారని ఆమె వెల్లడించారు. పార్టీల మధ్య పొత్తులు వ్యక్తుల మధ్య ఒప్పందాలు కాదని, పొత్తులపై ఎన్నికల సమయంలో కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తమ పార్టీ రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకోదని, ప్రజల సంక్షేమం కోసం సిద్ధాంతపరంగా నిర్ణయాలుంటాయని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల గురించి కేంద్రానికి చెబుతుంటామన్నారు.
పవన్కు ఇలా ముద్రగడ రిటార్ట్
ఏపీ సీఎం చంద్రబాబుకు అనుంగు మిత్రుడిగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ డిమాండ్ చాలా కాలం నాటిదని సెలవిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దీని గురించి ఎందుకు పట్టించుకోలేదని వక్రీకరణకు తెర తీశారు. కానీ కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో జారీ చేసిన సంగతి ఆయనకు తెలిసినా తెలియనట్లు వ్యవహరించారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు చెప్పే తప్పుడు మాటలు నమ్మొద్దని పవన్ కల్యాణ్ కు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడన్న సంగతి తెలియదా? .. మా జాతి.. మీ జాతి అని వ్యతిరేకిస్తారా? అని ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు నిలదీసినట్లు వార్తలొచ్చాయి.
పవన్ వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆర్ కృష్ణయ్య
పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకు వేసి ఈ వివాదంలోకి తెలంగాణలోని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను బయటకు లాగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాపులను బీసీలో కలుపుతామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వ్యతిరేకించని ఆర్.కృష్ణయ్య ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కాపులను బీసీలో కలుపుతామని 1994లో ఒక జీవో జారీ చేస్తే దానిపై హైకోర్టుకు వెళ్లామని, ఆ జీవోను హైకోర్టు కొట్టేసిన విషయం పవన్ కల్యాణ్ తెలుసుకొని మాట్లాడాలని ఆర్.కృష్ణయ్య తిరుగు జవాబిచ్చారు. అదేవిధంగా 1998, 2000లో జాతీయ కమిషన్ వచ్చినప్పుడూ అడ్డుకున్నామని గుర్తుచేశారు. కాపులను బీసీలో కలపడం అంటే ఒక పులి, ఒక ఎద్దుతో నాగలి కట్టడమేనన్నారు. కాపులను బీసీ జాబితాలో కలపాలంటే కొన్ని అర్హతలు ఉండాలని వివరించారు.