సభలో ఆత్మాహుతి, మరో ఇద్దరు: సబ్బం, వెంకయ్య ఫైర్
ఫిబ్రవరి 21 తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బీ పారం ఇస్తామన్నా తీసుకునేవారు ఉండరని సబ్బం అన్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకునేందుకే తమను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. 2జీ, బొగ్గు కుంభ కోణం సమయంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు పార్లమెంటును స్తంభింపజేశారని, అప్పుడు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.
ఫిబ్రవరి 24 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని, తాము ఆరుగురే కాదని, మిగితా ఎంపీలు తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని సబ్బంహరి తెలిపారు. పార్టీ సంకెళ్లు తెంచుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు. బహిష్కరించడం ద్వారా బిల్లును అడ్డుకుని, వ్యతిరేకంగా ఓటేసే స్వేచ్ఛ కల్పించి కాంగ్రెస్ తమకు మేలే చేసిందని చెప్పారు. వచ్చే 15 రోజుల్లో బిల్లును పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడమే ఇప్పుడు తమ లక్ష్యమని సబ్బం తెలిపారు.
వెంకయ్య నాయుడు ఆగ్రహం
కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులుగా పేర్కొనే వ్యక్తులు కూడా సమైక్య రాష్ట్రం కావాలంటూ ప్లకార్డులు పట్టుకొని సభలో నిల్చున్నారని, ఆ పార్టీ వారే బిల్లు తెస్తారు, ఆ పార్టీ వారే వ్యతిరేకిస్తారని, అంతేకాకుండా వారే వీధుల్లో వెళ్తూ చివరకు తమ పార్టీని విమర్శిస్తాని ఇదెక్కడిదని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీకి సిగ్గుంటే పార్టీని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లుకు సంబంధించి చేయాల్సిన హోంవర్క్, అధ్యయనాన్ని చేయలేదన్నారు. రాజ్యసభలో ప్రవేశపెడతామని హోం మంత్రి ముందే చెప్పారని అయితే, రాజ్యసభ చైర్మన్ అందుకు నిరాకరించడం న్యాయ శాఖ అంగీకరించకపోవడం లోక్సభలో ఎప్పుడు పెడతారో కూడా చెప్పలేకపోవడం చూస్తుంటే అంతా హడావుడిగా చేసేయాలని ప్రభుత్వం చూస్తోందే తప్ప దీనిపై ఎలాంటి అధ్యయనం చేయలేదని తెలుస్తోందన్నారు.
కాంగ్రెస్కు సిగ్గూ, శరం ఉంటే ఓ పద్ధతి ప్రకారం ఎందుకు వ్యవహరించాలని, అసలు అది పార్టీయేనా అని నిప్పులు చెరిగారు. తెలంగాణ విషయంలో బిజెపి ఎప్పుడూ వెనక్కి పోలేదన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమని, ఇప్పుడు కాకపోయినా రేపైనా అవుతుందన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్య కూడా పరిష్కారం కావాలని, సహృద్భావ వాతావరణం ఏర్పడాలన్నదే తమ వైఖరి అన్నారు. ఇప్పటికైనా తాము చెప్పిన సవరణలు తీసుకొచ్చి బిల్లు వీగిపోకుండా కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది తప్పకుండా ఆమోదం పొందుతుందని చెప్పారు.
ఇంత గంభీరమైన అంశంపై న్యాయ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం శాఖలు ముందే అధ్యయనం చేసి ఆ తర్వాత విపక్షాలను సంప్రదించాల్సిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదని అన్నారు. రాజ్యసభలో బిల్లు పెడతామని హోం మంత్రి ప్రకటించారని, ఈ మేరకు చైర్మన్కు ఉత్తరం కూడా రాశారని, సహకారం కావాలంటూ తమతో కూడా మాట్లాడారని ఇప్పుడేమో రాజ్యసభ కాదు లోక్సభలో తెస్తామంటున్నారని తెలిపారు. ఎందుకు లోక్సభలో పెడుతున్నారని ప్రశ్నిస్తే ఇది ద్రవ్య బిల్లు కాబట్టి లోక్సభలో తొలుత ప్రవేశపెట్టాలని న్యాయ శాఖ చెప్పిందని చెబుతున్నారన్నారు.
ప్రజలు బిజెపి గురించి ఆందోళన పడాల్సిన పని లేదన్నారు. దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్తో చర్చలు జరపాల్సిన అవసరం తనకు లేదని అయితే రాష్ట్రం అన్యాయమైపోందన్నారు. విభజన అనివార్యమని దృష్టిలో పెట్టుకునే తాను వారితో మాట్లాడానన్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధమైన సూచనలు ఏమీ తాము కేంద్రానికి సూచించలేదని, సీమాంధ్రకు జరిగే నష్టంపైనే మాట్లాడుతున్నామన్నారు.