ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జి: సీజేఐ ఎన్వీ రమణ కొలీజియం సిఫారసు: ఆ రెండింటికీ
అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి రానున్నారు. సీనియర్ అడ్వొకేట్.. న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ సహా ఢిల్లీ, పాట్నా హైకోర్టులకు కొత్త న్యాయమూర్తుల పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఆమోదం లభిస్తుందని తెలుస్తోంది.
ఈ జాబితాలో మొత్తం 15 మంది న్యాయవాదులు, న్యాయాధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ జాబితాను యధాతథంగా ఆమోదించడమంటూ జరిగితే- ఈ 15 మందిలో ఒకరు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అవుతారు. పాట్నా, ఢిల్లీ హైకోర్టులకు ఏడుమంది చొప్పున కొత్త న్యాయమూర్తులు నియమితులవుతారు. సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలో- జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖన్విల్కర్తో కూడిన కొలీజియం ఈ జాబితాను రూపొందించింది. దాన్ని కేంద్రానికి పంపించింది.
ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ మహ్మద్ సుభానీ షేక్ను న్యాయమూర్తిగా సిఫారసు చేసింది ఈ కొలీజియం. వికాస్ మహాజన్, తుషార్ రావు గెదెల, మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా, సచిన్ దత్త, అమిత్ మహాజన్, గౌరంగ్ కాంత్, సౌరభ్ బెనర్జీని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది కొలీజియం. జ్యుడీషియల్ అధికారులు శైలేంద్ర సింగ్, అరుణ్ కుమార్ ఝా, జితేంద్ర కుమార్, అలోక్ కుమార్ పాండే, సునీల్ దత్త మిశ్ర, చంద్రప్రకాశ్ సింగ్, చంద్రశేఖర్ ఝా పేర్లను పాట్నా హైకోర్టు న్యాయమూర్తులుగా రెకమెండ్ అయ్యారు.
ఏపీ హైకోర్టుకు మొత్తం 37 మంది న్యాయమూర్తులను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. వారిలో ప్రస్తుతానికి 26 మంది పని చేస్తోన్నారు. 11 ఖాళీలు ఇంకా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో భాగంగా సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా అడ్వొకేట్ మహ్మద్ సుభానీ షేక్ పేరును సిఫారసు చేసింది. అలాగే- ఢిల్లీ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 60. వాటిని కూడా ఇంకా భర్తీ చేయాల్సి ఉందని సమాచారం. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి రెండు రోజుల కిందటే సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలో కొలీజియం సమావేశమైంది.
దేశం మొత్తం మీద 1,104 మంది న్యాయమూర్తులకు గాను 388 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కొద్దిరోజుల కిందటే సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటివరకు మొత్తం 180 సిఫారసులు అందగా.. వాటిలో 126 పేర్లను కొలీజియం పరిశీలనలోకి తీసుకుంది. 50 ప్రతిపాదనలు ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు.