గూగుల్, విప్రోతో టీ చర్చ, ఏపీకి టీవీఎస్, టయోటాలు
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు వచ్చాయి. హీరో మోటార్స్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. అదే దారిలో టీవీఎస్, టయోటా సంస్థలు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు తమ యూనిట్లను ఏపీలో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో మాట్లాడుతోంది. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది. టీవీఎస్, టయోటా కంపెనీలు ప్రాథమికంగా ఏపీలో యూనిట్లు పెట్టేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. టీవీఎస్ రూ.1,200 కోట్లతో, టయోటా రూ.3,000 కోట్లతో యూనిట్లు పెట్టే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు ఈ విషయమై సదరు రెండు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ రెండు కంపెనీలు ఏపీలో యూనిట్లు పెడితే.. ఎక్కడ భూమి కోరితే అక్కడ ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా కంపెనీలకు ఎన్నో కన్సెన్షేన్స్ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన జపాన్ పర్యటనలో టయోటా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు.
గూగుల్, హెచ్ఎస్బిసి, విప్రోతో చర్చిస్తున్నాం: కేటీఆర్
గూగుల్, హెచ్ఎస్బీసీ, కాగ్నిజెంట్, విప్రో తదితర కంపెనీలు హైదరాబాద్లోనూ తమ ప్రాజెక్టులను విస్తరించే విషయంలో ఆ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, సమాచార, సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ ప్రశ్నలపై చర్చ జరగకుండానే మరో అజెండా చేపట్టడం జరిగింది. అయితే సంబంధిత ప్రశ్నలకు మంత్రులు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. హైదరాబాద్లో ఐటి రంగాన్ని అభివృద్ధి చేసే అంశంపై డికె అరుణ, చిన్నారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు.
ఐటీఐఆర్ ప్రారంభమైన తర్వాత మొదటి మూడు సంవత్సరాల్లో ప్రత్యక్ష ఉపాధి అవకాశాల దామాషా ప్రాతిపదికగా సుమారు 1.80 లక్షలుగా ఉంటుందని తెలిపారు. అంతర్గత మౌలిక సదుపాయాల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ.13 వేల కోట్లు భారం ఉంటుందని అంచనా వేయడం జరిగిందన్నారు.