చంద్రబాబు గేమ్: దిమ్మ తిరుగుతున్న నంద్యాల ట్విస్టులు
నంద్యాలలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ రాజకీయ క్రీడకు తెర తీశారు. అయితే, అది తీవ్ర పరిణామాలకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్నూలు: నంద్యాల శాసనసభ ఉప ఎన్నిక మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. నంద్యాలలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ రాజకీయ క్రీడకు తెర తీశారు. అయితే, అది తీవ్ర పరిణామాలకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజాగా, గంగుల ప్రతాపరెడ్డిని టిడిపిలోకి ఆహ్వానించడంతో మంత్రి అఖిల ప్రియ కంగు తిన్నారు. తనకు ఎదురు వర్గానికి చెందిన ప్రతాపరెడ్డిని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారో తెలియక ఆమె తికమక పడుతున్నట్లు కనిపిస్తున్నారు.
తన భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నట్లు అఖిల ప్రియ అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, గంగుల ప్రతాపరెడ్డిని ఆహ్వానించడంలో చంద్రబాబు వ్యూహం వేరే విధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ వ్యూహం దెబ్బ తింటుందా అనేది చెప్పలేని స్థితి.
ఆదినారాయణ రెడ్డి తాజా డిమాండ్....
మొదటి నుంచి పార్టీలో ఉన్న రామసుబ్బారెడ్డి మాటను బేఖాతరు చేస్తూ చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి జమ్మలమడుగులో విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డిని టిడిపిలోకి తీసుకున్నారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే, దానితో ఆయన సంతృప్తి చెందడం లేదని అంటున్నారు. తన కుమారుడు సుధీర్ రెడ్డికి ఎపి వైద్య విధాన పరిషత్ చైర్మన్ పదవి కావాలని అడుగుతున్నారని సమాచారం. ఈ కోరికను నెరవేర్చకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంటున్నట్లు వినికిడి. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే కుమారుడు సుధీర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినా చేరవచ్చునని అంటున్నారు. ఈ తాజా పరిణామం నంద్యాల ఉప ఎన్నికపై కూడా పడుతుందని భావిస్తున్నారు.
Recommended Video
ఎస్పీ వై రెడ్డికి హెచ్చరిక....
నంద్యాల ఉప ఎన్నికలో ఓసారి వీల్ చైర్లో కూర్చుని ప్రచారం చేశారు. అయితే, దాంతో చంద్రబాబు సంతృప్తి చెందడం లేదని అంటున్నారు. నంద్యాలలో సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో లోకసభ సీటు గంగుల ప్రతాపరెడ్డికి ఇస్తాననే సంకేతాలను ఎస్పీవై రెడ్డికి పంపించాలని ఆయన అనుకున్నట్లు చెబుతున్నరు. అందుకే గంగుల ప్రతాపరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారని సమాచారం. అయితే, ఇప్పటికీ గంగుల ప్రతాపరెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర్ రెడ్డి వైసిపిలోనే ఉన్నారు.
రామసుబ్బారెడ్డి నుంచి మరోటి...
ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అలక వహించిన రామసుబ్బారెడ్డిని బుజ్జగించాల్సిన అవసరం చంద్రబాబుకు ఏర్పడింది. దీంతో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే, అంతటితో రామసుబ్బారెడ్డి కథ ముగిసిపోలేదని తెలుస్తోంది. తన అన్న రామసుబ్బారెడ్డికి వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టిడిపి టికెట్ రాకపోతే వేరే ఆలోచన చేయాల్సి వస్తుందని హైమవతి హెచ్చరించారు.
శిల్పా మోహన్ రెడ్డి ఇలా...
నంద్యాల శానససభ టికెట్ కోసం పట్టుబట్టి అది దక్కకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు వైసిపి టికెట్పై పోటీ చేస్తున్నారు. ఇది ఒక రకంగా చంద్రబాబును సవాల్ చేయడం వంటిదే. ఆయనతో పాటు సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వైసిపిలోకి వచ్చేశారు.